స్వదేశానికి భారత వలసదారులు

Feb 14,2025 22:09 #America, #illegal immigration

అమెరికా నుంచి నేడు రెండో విమానం రాక
చంఢగీఢ్‌ : సరైన పత్రాలు లేని భారత వలసదారులతో కూడిన అమెరికా సైనిక విమానం శనివారం అమృత్‌సర్‌కు చేరుకోనుంది. 119 మంది ఉన్న ఈ విమానం రాత్రి 10 గంటల సమయానికి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరికంచిన డోనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశంలో ఉంటున్న వలసదారులపై తీవ్ర చర్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. గత నెలలో మొదటిసారిగా 104 మంది భారత వలసదారుల్ని విమానంలో తరలించారు. కాగా, శనివారం భారత్‌ చేరుకునే 119 మందిలో 67 మంది పంజాబ్‌కు, 33 మంది హర్యానాకు చెందిన వారు. అలాగే గుజరాత్‌కు చెందిన వారు ఎనిమిది మంది, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు ముగ్గురు, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌కు చెందిన వారు ఇద్దరేసి చొప్పున ఉన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకాశ్మీర్‌లకు చెందిన వారు ఒక్కొరు ఉన్నారు. కాగా, ఆదివారం కూడా అమృత్‌సర్‌కు అమెరికా నుంచి మరొక విమానం వచ్చే అవకాశ ఉంది. కాగా, అమెరికా నుంచి వస్తున్న విమానాలు అమృత్‌సర్‌లోనే దిగడంపై విమర్శలు వస్తున్నాయి. పంజాబ్‌ను అప్రతిష్టపాలు చేయడానికే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమెరికా విమానాలను అమృత్‌సర్‌లో దింపడానికి అనుమతించిందని పంజాబ్‌ ఆర్థిక మంత్రి హర్పాల్‌ సింగ్‌ ఛీమా విమర్శించారు. ఈ విమానాలు గుజరాత్‌, హర్యానా లేదా ఢిల్లీలో ఎందుకు ల్యాండ్‌ అవ్వడం లేదని ప్రశ్నించారు.

➡️