న్యూఢిల్లీ : ‘ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా సరే..’ తాము అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నామని భారత నావికా దళం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం పోస్టు చేసింది. సరిహద్దులో ఉద్రికత్తల నేపథ్యంలో నావికా దళం ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను నేవీ ఆదివారం పరీక్షించింది. సముద్ర జలాల్లో ఎప్పుడైనా.. ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్ నేవీ సిద్ధమని తెలిపింది. మూడ్రోజుల క్రితమే భారత్ ఇదే సముద్రంలో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (ఎంఆర్-ఎస్ఏఎం)తో సీ స్కిమ్మింగ్ పరీక్షను నిర్వహించింది. గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు నౌకాదళం వీడియోను విడుదల చేసింది. సీ స్కిమ్మింగ్ టార్గెట్ను కచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు వెల్లడించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా పేర్కొంటారు.
