25, 26 తేదీల్లో ఇండోనేషియా అధ్యక్షులు పర్యటన

న్యూఢిల్లీ : ఈ నెల 25, 26 తేదీల్లో ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవా సుబియాంటో దేశంలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు 76వ రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న ఆయన రెండు రోజులు దేశంలోనే ఉంటారు. 2024 అక్టోబర్‌లో ప్రబోవా సుబియాంటో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. భారత్‌లో ఆయన అడుగుపెట్టడం ఇదే తొలిసారి అని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని తెలిపింది. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలను చర్చించడానికి అవకాశాన్ని కల్పిస్తుందని విదేశాంగ శాఖ పేర్కొంది. సుబియాంటో 2020లో ఇండోనేషియా రక్షణ మంత్రిగా న్యూఢిల్లీని సందర్శి ంచారు.1950 నుంచి భారత్‌ తన మిత్ర దేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. 1952, 53, 66ల్లో మాత్రమే విదేశీ అథితులు లేకుండా రిపబ్లిక్‌ డే వేడుకలను నిర్వహించారు. 2024లో ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌, 2023లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫట్టా ఎస్‌-సిసి ముఖ్య అతిథిగా వచ్చారు. 2021, 2022 సంవత్సరాల్లో కరోనా కారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథులను ఆహ్వానించలేదు.

➡️