న్యూఢిల్లీ : భారత పారిశ్రామికోత్పత్తి వృద్ధి ఈ ఏడాది నవంబర్లో 5.2 శాతానికి పెరిగింది. తయారీ రంగం మెరుగైన ఫలితాలు సాధించడంతో ఈ వృద్ధి నమోదైనట్లు శుక్రవారం విడుదలైన అధికారిక ప్రకటన తెలిపింది. ఫ్యాక్టరీ ఉత్పత్తికి కొలమానంగా నిలిచే పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి) 2023లో 2.5 శాతం వృద్ధిని సాధించింది. 2024 నవంబర్లో ఈ సూచీ 5.2 శాతానికి పెరిగిందని తెలిపింది. ఏప్రిల్ -నవంబర్ కాలంలో ఐఐపి 4.1 శాతం వృద్ధి చెందింది. ఇది గతేడాది ఇదే సమయంలో 6.5 శాతం కన్నా తగ్గింది.
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఒ) విడుదల చేసిన సమాచారం ప్రకారం.. 2024 నవంబర్లో తయారీ రంగం ఉత్పాదకత 5.8 శాతం పెరిగింది. ఇది గతేడాదితో పోలిస్తే 1.3 శాతం పెరిగింది. 2024 నవంబర్లో మైనింగ్ ఉత్పత్తి 1.9 శాతం గా ఉండగా, విద్యుత్ ఉత్పత్తి 4.4 శాతానికి పెరిగింది.