- నిఘా సంస్థలు హెచ్చరించినా చర్యలు మృగ్యం
- ప్రధాని మోడీ తీరుపై ఖర్గే విమర్శలు
రాంచి : జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదముందని నిఘా సంస్థలు ముందుగానే హెచ్చరించినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రత్యేకించి పహల్గాం దాడికి సంబంధించి ప్రధాని మోడీకి నిఘా వర్గాలు ముందే హెచ్చరించాయని, ఆయన స్వీయ పర్యటను వాయిదా వేసుకున్నారే మినహా ప్రజల భద్రతను పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీహార్ ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో రాంచిలో నిర్వహించిన ‘సంవిధాన్ బచావో’ సభలో ఖర్గే ప్రసంగించారు. ఉగ్ర దాడులు జరుగుతాయని నిఘా వర్గాల సమాచారముందన్న కథనాలను ప్రస్తావించిన ఖర్గే..ముందుగానే సమాచారం ఉన్నప్పుడు భద్రతను పటిష్టం చేస్తూ ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. పహల్గాం దాడికి మూడు రోజులు ముందుగా నిఘా వర్గాల సమాచారం వచ్చినందునే ప్రధాని మోడీ తన కాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఖర్గే పేర్కొన్నారు. మోడీని ఉద్దేశించి ఆయన వరుస ప్రశ్నలు సంధించారు. ‘మీకు (మోడీ) ముందుగానే పరిస్థితి గురించి సమాచారం తెలిసినట్లైతే, అదే విషయాన్ని మీ నిఘా బృందానికి, భద్రతా వర్గాలకు, కాశ్మీర్ పోలీసులకు, బిఎస్ఎఫ్ బృందాలకు ఎందుకు తెలియచేయలేదు. ప్రజల భద్రతకు హామీ ఎందుకు కల్పించలేదు.” అని ఖర్గే ప్రశ్నించారు. భద్రతా వైఫల్యం వుందని అఖిల పక్ష సమావేశంలో మోడీ సర్కార్ అంగీకరించిందని, ఈ దాడిలో కోల్పోయిన ప్రాణాలకు కూడా బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఏప్రిల్ 19న కాత్రా నుండి శ్రీనగర్కు వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని మోడీ ప్రారంభించాల్సి వుంది. ఒక పౌరుడిగా తాను, పాకిస్తాన్పై ప్రభుత్వం చేసే పోరాటానికి మద్దతునిస్తానని ఖర్గే చెప్పారు. అయితే ప్రజల ప్రాణాల గురించి ప్రభుత్వానికి పట్టడంలేదని విమర్శించారు.