న్యూఢిల్లీ : భారత నౌకాదళంలోకి స్టీల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తుశీల్ ప్రవేశించింది. రష్యాలోని కాలినిన్గ్రాడ్ నౌకాశ్రయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్కు రష్యా అధికారులు ఈ యుద్ధనౌకను అప్పగించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్సింగ్ మాట్లాడుతూ ‘ఆత్మ నిర్భర్ భారత్’కు రష్యా సంపూర్ణ మద్దతు ఇవ్వడం రెండు దేశాల మధ్య వున్న స్నేహబంధానికి మరొక ముఖ్యమైన ఉదాహరణ’ అని అన్నారు. ఐఎన్ఎస్ తుశీల్తో సహా అనేక నౌకల్లో మేడ్ ఇన్ ఇండియా కంటెంట్ నిరంతరం పెరుగుతుందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, స్పేస్ ఎక్స్ప్లోరేషన్, కౌంటర్ టెర్రరిజం వంటి రంగాల్లో పరస్పర నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భారత్-రష్యాలు నూతన సహకార యుగంలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. 2016 అక్టోబర్లో నాలుగు స్టీల్త్ ఫ్రిగేట్ల కోసం భారత్-రష్యాల మధ్య ఒప్పందం కుదిరింది. వీటిలో రెండు రష్యాలోనూ, రెండు భారత్లోనూ నిర్మిస్తారు. కోవిడ్, ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఈ ఒప్పందం అమల్లో జాప్యం జరిగింది.
