అది ‘మూడు గోపురాల నిర్మాణ’మట !

బాబ్రీ మసీదు పేరే ఎత్తని ఎన్‌సిఇఆర్‌టి
న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు పేరు కూడా తలవడానికి ఎన్‌సిఇఆర్‌టి ఇష్టపడడం లేదు. గత పదేళ్లుగా చరిత్రను, సామాజిక శాస్త్రాలను కాషాయీకరణ చేస్తున్న మోడీ సర్కారు తాజాగా సరికొత్త వివాదానికి తెరలేపింది. జాతీయ విద్యా పరిశోధనా మండలి (ఎన్‌సిఇఆర్‌టి) తన 12వ తరగతి రాజకీయ శాస్త్రం పాఠ్య పుస్తకంలో అయోధ్యలోని బాబ్రీ మసీదు పేరును ప్రస్తావించకుండా దానిని ‘మూడు గోపురాల నిర్మాణం’గా చెప్పుకొచ్చింది. దీనిని 16వ శతాబ్దిలో మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ వద్ద జనరల్‌గా పనిచేసిన మిర్‌ బాఖీ రామమందిరాన్ని కూల్చి నిర్మించాడని పేర్కొంది. ‘ఈ నిర్మాణంలో హిందూ చిహ్నాలు స్పష్టంగా కన్పించాయి. నిర్మాణం లోపల, బయట కూడా కొన్ని హిందూ కట్టడాలకు చెందిన అవశేషాలు ఉన్నాయి’ అని వివరించింది. ఎల్‌కె అద్వానీ నాయకత్వంలో బిజెపి నిర్వహించిన రథయాత్ర, అందులో భాగంగా జరిగిన అల్లర్లకు సంబంధించిన అంశాలను పుస్తకం నుంచి తొలగించారు. మసీదు కూల్చివేత, రామజన్మభూమి ఆందోళనల ప్రస్తావన లేకుండానే కొత్త పాఠ్య పుస్తకాన్ని తయారు చేశారు.
16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదును మిర్‌ బాఖీ నిర్మించాడని పాత పాఠ్య పుస్తకంలో ఉంది. ఎన్‌సిఇఆర్‌టి కొత్త పాఠ్య పుస్తకంలో అయోధ్య పాఠ్యాంశానికి కేవలం రెండు పేజీలు మాత్రమే కేటాయించారు. గతంలో నాలుగు పేజీల పాఠ్యాంశం ఉండేది. ఫైజాబాద్‌ జిల్లా కోర్టు ఆదేశాల మేరకు 1986 ఫిబ్రవరిలో బాబ్రీ మసీదు తాళాలు తెరిచారని, ఆ తర్వాత ఇరు పక్షాలు అక్కడ మోహరించాయని పాత పుస్తకంలో ఉంది. అయోధ్యలో జరుగుతున్న పరిణామాలపై బిజెపి విచారం వ్యక్తం చేసిందని అందులో చెప్పారు. అయోధ్య వివాదం లౌకికవాదంపై చర్చకు దారితీసిందని కూడా తెలిపారు. కొత్త పుస్తకంలో ఇవేవీ లేవు. ‘నిర్మాణం తలుపులు తెరవాలని, ప్రార్థనలు చేసుకునేందుకు ప్రజలను అనుమతించాలని ఫైజాబాద్‌ (ఇప్పుడు అయోధ్య) జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో 1986లో మూడు గోపురాల నిర్మాణానికి సంబంధించిన పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఈ వివాదం అనేక దశాబ్దాల పాటు కొనసాగింది. ఆలయాన్ని కూలదోసి శ్రీరామ జన్మస్థలిలో మూడు గోపురాల నిర్మాణం జరిపారని ప్రజలు విశ్వసించడంతో వివాదం మొదలైంది’ అని మాత్రమే కొత్త పాఠ్య పుస్తకంలో రాశారు. శ్రీరాముడి జన్మస్థలిని విస్మరించారని హిందువులు ఆందోళన వ్యక్తం చేశారని, నిర్మాణాన్ని తమ ఆధీనంలోనే ఉంచేలా హామీ ఇవ్వాలని ముస్లింలు కోరారని కొత్త పుస్తకంలో తెలియజేశారు.
వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగులను కూడా పాత పాఠ్య పుస్తకంలో చేర్చారు. ‘బాబ్రీ మసీదు కూల్చివేత : కల్యాణ్‌ ప్రభుత్వానికి కేంద్రం ఉద్వాసన’ శీర్షికతో వచ్చిన ఓ వార్తను ప్రదర్శించారు. ‘బిజెపి తప్పుడు అంచనాలు ఘోరం’ అంటూ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ మరో పత్రిక పెట్టిన శీర్షికను కూడా పాత పుస్తకంలో చూపారు. కొత్త పుస్తకంలో మాత్రం అలాంటి క్లిప్పింగులేవీ కన్పించలేదు. సిబిఎస్‌ఇ పరిధిలోని పాఠశాలల్లో ఈ పాఠ్య పుస్తకాలను బోధిస్తారు. భారత రాజకీయాల్లో తాజా పరిణామాలకు అనుగుణంగా పాఠ్య పుస్తకంలోని అంశాలను మార్పు చేసినట్లు ఎన్‌సిఇఆర్‌టి పేర్కొంది.
ద్వేషం, హింస బోధనకు సంబంధించిన అంశాలు కాదని ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్‌ దినేష్‌ ప్రసాద్‌ సక్లానీ చెప్పారు. ఆయనకు పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాలను ప్రస్తావించారు. తాము సానుకూల పౌరులను సృష్టించాలనుకుంటున్నామని, హింసాత్మక లేదా అణచివేయబడిన పౌరులను సృష్టించాలనుకోవడం లేదని, అందువల్లే అల్లర్ల గురించి బోధించడం లేదని చెప్పారు. పాఠ్య పుస్తకాలను ఏటా సవరిస్తారని, ఏది మార్చాలనేది బోధనా శాస్త్ర నిపుణులు నిర్ణయిస్తారని, తాను ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోనని, పై నుంచి వారికి ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పుకొచ్చారు.

➡️