తెలంగాణ వంటి రాష్ట్రాలు డిమాండ్ చేయటం దురదృష్టకరం : కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్
ముంబయి : పన్నులు చెల్లించిన దామాషా ప్రకారం కేంద్ర నిధులు కావాలని కొన్ని రాష్ట్రాలు, కొందరు నేతలు డిమాండ్ చేయడం అల్పమైన ఆలోచన, దురదృష్టకరమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ అన్నారు. ముంబయిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం వృద్ధి చెందాలంటే ఈశాన్య రాష్ట్రాలతో పాటు బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ కూడా కచ్చితంగా అభివృద్ధి చెందాలనేది ప్రధాని మోడీ ఆలోచన అని చెప్పారు. ”తెలంగాణ, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో గతంలో అధికారంలో ఉన్నవారు కేంద్రానికి చెల్లించిన పన్నుల సొమ్ము మొత్తం కేంద్ర నిధుల కింద తిరిగి రాష్ట్రాలకు రావాలని అడుగుతుంటారు. ఇంతకంటే అల్పమైన ఆలోచన మరొకటి ఉండదు. ఇంతకంటే దురదృష్టకరం ఇంకోటి ఉండదు” అని ఆయన వ్యాఖ్యానించారు.