న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్లోని జమ్ము ప్రాంతంలో గత 32 నెలల్లో ఎన్కౌంటర్లలో మరణించిన మొత్తం జవాన్ల సంఖ్య 48కి చేరినట్లు అధికారులు తెలిపారు. దొడా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.
అధికారుల సమాచారం ప్రకారం.. దొడా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు భారత ఆర్మీ, జమ్ముకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగారని, దీంతో ఎన్కౌంటర్ ప్రారంభమైందని ఆర్మీ కార్ప్స్ సోమవారం రాత్రి ఎక్స్లో ట్వీట్ చేసింది. ఎన్కౌంటర్ కొనసాగుతోందని తెలిపింది.
ఇటీవల జరిగిన ప్రధాన దాడులు
జులై 16, 2024 : దొడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లు మృతి
జులై 8, 2024 : కతువా జిల్లాలో ఆర్మీ కాన్వాయ్పై జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు మరణించగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
జూన్ 11-12, 2024 : జంట దాడుల్లో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు.
జూన్ 9, 2024 : రియాసి జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు.
మే 4, 2024 : పూంచ్ జిల్లాలో ఐఎఎఫ్కి చెందిన రెండు వాహనాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వైమానిక దళానికి చెందిన ఓ సైనికుడు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
డిసెంబర్ 21,2023 : ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లు మృతి
నవంబర్ 2023 : ఇద్దరు కెప్టెన్లు సహా ఐదుగురు జవాన్లు మృతి
ఏప్రిల్-మే 2023 : జంట దాడుల్లో పది మంది జవాన్లు మృతి
మే 2022 : కత్రాలో యాత్రికుల బస్సుపై దాడిలో నలుగురు వ్యక్తులు మరణించారు.
డిసెంబర్ 2021 : నలుగురు సైనికులు మృతి