న్యూఢిల్లీ : భారత్ పర్యటనలో భాగంగా అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్.. తన కుటుంబ సమేతంగా నేడు రాజస్థాన్లోని అంబర్కోటను సందర్శించారు. ఈ సందర్భంగా వాన్స్ కుటుంబ సభ్యులకు యూనెస్క్ వరల్డ్ హెరిటేజ్ సైట్ వద్ద రాజస్థానీ సంప్రదాయంలో ఘన స్వాగతం లభించింది. హతీ గావ్లో ప్రత్యేక శిక్షణ పొందిన చందా, పుష్ప అనే ఏనుగులు వాన్స్ కుటుంబానికి స్వాగతం పలికాయి. పలువురు నృత్యాలతో వారిని అలరించారు. అంబర్ కోటతో పాటు హవా మహల్, జంతర్ మంతర్ను సైతం వాన్స్ కుటుంబం సందర్శించనుంది.
ఇక ఈ పర్యటనలో రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్ హరిబావు కిషన్రావ్, ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ వాన్స్ కుటుంబానికి ఆతిథ్యమివ్వనున్నారు. నేడు రాజస్థాన్ ఇంటర్నేషన్ సెంటర్లో దౌత్యవేత్తలు, మేధావులను ఉద్దేశించి అమెరికా-భారత్ సంబంధాలపై జేడీ వాన్స్ ప్రసంగించనున్నారు. జెడివాన్స్ కుటుంబం ప్రముఖులు బస చేసే రామ్బాగ్ ప్యాలెస్లో దిగగా.. అక్కడ కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
