బెంగుళూరు : కర్ణాటకలో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన కొప్పాల్లో ఉన్న తుంగభద్ర కెనాల్ వద్ద గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి డిన్నర్ చేసి తుంగభద్ర లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వద్ద విహారానికి వెళ్లిన సమయంలో బైక్పై వచ్చిన వ్యక్తులు పర్యాటక బృందంపై దాడి చేశారు. ఆ సమయంలో మహిళలతో కలిసి ఉన్న మరో ముగ్గురిని దాడికి పాల్పడినవారు కాలువలోకి తోసివేశారు. వీరిలో అమెరికాకు చెందిన డేనియల్, మహారాష్ట్ర పర్యాటకుడు పంకజ్ ప్రాణాలతో బయటకు వచ్చారు. ఒడిశాకు చెందిన బిబాష్ గల్లంతయ్యారు.
పర్యాటక బృందాన్ని పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందని అడిగి.. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేశారని హోమ్స్టే ఓనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో.. వాళ్లు పర్యాటకులపై దాడి చేశారని, మహిళలపై అత్యాచారం చేశారని తెలిపారు. నిందితులు బైక్పై పారిపోయినట్లు చెప్పారు. సామూహిక అత్యాచారానికి గురైన ఇద్దరు మహిళల్లో ఒకరు ఇజ్రాయిలీ మహిళ ఉన్నారని కొప్పాల్ ఎస్పి రామ్ అరసిద్ది తెలిపారు. చికిత్స కోసం వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మహిళలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితులపై గ్యాంగ్ రేప్, దొంగతనం కేసు నమోదు చేశారు.
