న్యూఢిల్లీ : అక్రమాస్తులు కేసులో సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కర్ణాటక డిప్యూటీ సిఎం డి.కె.శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిబిఐ కేసు పూర్తిగా చట్టవిరుద్ధమని శివకుమార్ తరపున న్యాయవాదులు ముకుల్ రోహిత్గీ, విపిన్ సంఘీలు జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనానికి తెలిపారు.
ఈ అభియోగాలు తీవ్రమైనవి, అవినీతి నిరోధక (పిసి) చట్టం కింద నేరాలకు సంబంధించినవి అని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు. పిసి చట్టంలోని సెక్షన్ 17ఎని సిబిఐ అనుసరించలేదని రోహిత్గీ వాదించారు. సెక్షన్ 17ఎ నిబంధన ప్రకారం.. తగిన అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా పిసి చట్టం ప్రకారం ప్రభుత్వ అధికారిపై ఆరోపించిన నేరంపై పోలీసు అధికారి ఎటువంటి విచారణ, లేదా దర్యాప్తు చేపట్టకూడదని రోహిత్గీ పేర్కొన్నారు. ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే విచారణ జరుపుతున్న ఇదే అంశంపై సిబిఐ ఏకకాలంలో దర్యాప్తు ప్రారంభిచకూడదని అన్నారు.
వాదనలు విన్న జస్టిస్ త్రివేది .. సిబిఐ ఎఫ్ఐఆర్ను కొట్టివేయలేమని పేర్కొన్నారు. సిబిఐ కేసును రద్దు చేయాలన్న రోహిత్గీ వాదనను తోసిపుచ్చారు. సిబిఐ కేసును కొట్టివేసేందుకు గతేడాది అక్టోబర్లో కర్ణాటక హైకోర్టు కూడా నిరాకరించిన సంగతి తెలిసిందే.
రూ.74.93 కోట్లమేర ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నారనే ఆరోపణలపై అవినీతి నిరోధక చట్టం కింద శివకుమార్పై 2020లో సిబిఐ కేసు నమోదు చేసింది.