న్యూఢిల్లీ : ఈ నెల 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి నేతలు ఓటుకు మూడు వేల రూపాయల చొప్పున పంచుతున్నారు. దీంతో బిజెపి నేతలు పన్ని డబ్బు వలలో ఓటర్లు పడకండి అని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఆయన ఈ అంశంపై ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు ఈరోజు మురికివాడల నివాసితులు (జుగ్గీలు)ల నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఓట్ల కోసం బిజెపి నేతలు ఇంటింటికీ వెళుతున్నారు. మూడు వేల రూపాయలు ఇస్తామని ప్రజలకు ఆశచూపుతున్నారు. ఎన్నికల సంఘం సహకారంతో ఇంటింటికీ ఓటు సౌకర్యం కల్పిస్తామని బిజెపి నేతలు హామీనిస్తున్నారు. ఇది విని నేను షాక్ అయ్యాను. నేను మీ అన్నను. ఇది విని నాకు రాత్రి నిద్రపట్టలేదు. బిజెపి ఉచ్చులో పడకండి. వారు కోరుకున్నట్లే మీరు వారికి ఓటు వేసి.. సిరా చూపించినా..వారు మీపై కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. బిజెపికి మీరు ఓటు వేయకండి. బిజెపి నేతలు మీకు ఉచితంగా డబ్బు ఇస్తే తీసుకోండి. కానీ వారికి ఓటు మాత్రం వేయకండి.’ అని ఆయన అన్నారు. ఒకవేళ రాష్ట్రంలో పొరపాటున బిజెపి ప్రభుత్వం వస్తే మురికివాడల్ని తొలగిస్తుంది అని కేజ్రీవాల్ అన్నారు.
