న్యూఢిల్లీ : ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నిక సంఘంపైనా, ఢిల్లీ పోలీసులపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులు, ఈసీ బిజెపికి మద్దతు ఇస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. బిజెపి నేతలు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కి.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఓటర్లకు మద్యం, మనీ ఆశ చూపిస్తున్నారు. పైగా గూండాయిజం చేస్తున్నారు. బిజెపి నేతల ఆగడాలను ప్రశ్నించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై కేసు నమోదు చేశారు. బిజెపి నేతల ఆగడాల్ని ఆపేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు, ఎన్నికల సంఘం కేసులు నమోదు చేస్తోందని కేజ్రీవాల్ ఎక్స్లో పేర్కొన్నారు.
కాగా, బిజెపి నేత రమేష్ బిదూరి, ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రక్రియను ఆటంకం కలిగిస్తున్నారు. ఎన్నికల నిబంధనలను యధేచ్ఛగా వుల్లంఘిస్తున్నారు. ఎంసిసి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని ఉల్లంఘించిన సభ్యులపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఢిల్లీ సిఎం అతిషి ప్రశ్నించారు. అయితే అతిషినే ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ఆమెపైనే కేసు నమోదు చేసినట్లు సౌత్ ఈస్ట్ ఢిల్లీ డిసిపి తెలిపారు.
