రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ సిఎం విజయన్‌

తిరువనంతపురం (కేరళ) : కేరళలోని తిరువనంతపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తృటిలో తప్పించుకున్నారు. బైక్‌ను నడుపుతున్న ఒక మహిళను కాపాడేందుకు ముఖ్యమంత్రి పినరయి కారు పైలెట్‌ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయడంతో సిఎం కాన్వాయ్ లోని పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారుకు స్వల్పంగా దెబ్బతింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో బైక్‌ నడుపుతున్న ఒక మహిళ అకస్మాత్తుగా కుడివైపు మలుపు తీసుకోవడాన్ని చూడవచ్చు. దీంతో ఆమె వెనుక ఉన్న తెల్లటి ఎస్‌యూవీ ఆగిపోయింది. తరువాత ఆ ఎస్‌యూవీ వెనుక వస్తున్న అంబులెన్స్‌తో సహా ఆరు ఎస్కార్ట్‌ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కొట్టాయం పర్యటన ముగించుకున్న సిఎం విజయన్‌ తిరిగి తిరువనంతపురంకు వస్తుండగా వామనపురంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం అనంతరం భద్రతా సిబ్బంది వెంటనే వాహనాల నుంచి దిగి పరిస్థితిని పరిశీలించారు. వైద్య సిబ్బంది కూడా అంబులెన్స్‌ నుండి బయటకు వచ్చి అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం బైక్‌ను నడిపిన ఆ మహిళను పోలీసులు విచారిస్తున్నారు.

➡️