land-for-jobs case : లాలూ ప్రసాద్‌, తేజస్వి యాదవ్‌లకు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌

న్యూఢిల్లీ : బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి పార్టీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌లకు ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కేసులో ఢిల్లీ హైకోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్‌ గోగే ఈ కేసులో లాలూకి, తేజస్వి యాదవ్‌లకు ఊరట కల్పించారు. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయమూర్తి ఆర్‌జెడి నేతలకు బెయిల్‌ మంజూరు చేశారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో లాలూని, తేజస్వి యాదవ్‌లను అరెస్టు చేయలేదని న్యాయమూర్తి తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్‌ 25న జరగనుంది.
కాగా, ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ స్కామ్‌ కేసులో కోర్టు ముందు హాజరు కావాలని ఢిల్లీ కోర్టు లాలూ, తేజస్వి యాదవ్‌లకు గత నెల 18న సమన్లు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఆగస్టు 6వ తేదీన ఈ కేసుకు సంబంధించిన తుది నివేదికను కోర్టుకు సమర్పించింది.
లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కేంద్ర రైల్వే శాఖామంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాల కోసం అభ్యర్థుల దగ్గర నుంచి భూములను తక్కువ ధరకే లాలూ కుటుంబీకులు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి.

➡️