పలు రాష్ట్రాలను కోరిన కేంద్ర హోం శాఖ
రక్షణ కార్యదర్శితో మోడీ భేటీ
బాగ్లీహర్ డ్యామ్ నుండి నీటి విడుదల నిలిపివేత
ఉగ్రవాదంపై పోరుకు మద్దతిస్తామన్న పుతిన్
సైనిక పరిష్కారం సరైంది కాదు : ఐరాస చీఫ్
న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ దేశ భద్రతా సన్నద్ధతను పెంచుతూ కేంద్రం కొన్ని చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా పౌరుల రక్షణకు సంబంధించి బుధవారం 7వ తేదీన మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా పలు రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ కోరింది. వైమానిక దాడులు జరిగితే ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలో ఈ మాక్ డ్రిల్స్లో తెలియజేయాల్సిందిగా కోరింది. వైమానిక దాడులు జరగడం వంటి అత్యవసర సమయాల్లో ఎలా ప్రతిస్పందించాలో ప్రజలకు నేర్పించాలని కోరింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్ము కాశ్మీర్, పంజాబ్, హర్యానా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఈ మాక్ డ్రిల్స్ను నిర్వహించాలని సూచించింది.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాల అధిపతులు, ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఆయన సోమవారం రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్తో భేటీ అయ్యారు. ఆదివారం వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్, మోడీతో సమావేశమైన విషయం తెలిసిందే.
ఐఇడిల ధ్వంసం
ఇదిలావుండగా జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని భద్రతా దళాలు కనిపెట్టాయి. అందులో నుంచి ఐదు ఐఇడిలు, రెండు వైర్లెస్ సెట్లను స్వాధీనం చేసుకున్నాయి. అర కిలో నుండి ఐదు కిలోల వరకూ బరువున్న ఈ ఐఇడిలను ధ్వంసం చేశారు. తద్వారా సరిహద్దు జిల్లాలో పేలుళ్లకు పాల్పడాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను భగం చేశారు.
పాక్పై మరో సర్జికల్ స్ట్రైక్ ! బాగ్లీహర్ డ్యామ్ నీటి విడుదల
పాకిస్తాన్పై భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ జరిపింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా బాగ్లీహర్ డ్యామ్ నుండి నీటి విడుదలను నిలిపివేసింది. చీనాబ్ నదిపై నిర్మించిన ఈ ఆనకట్ట ద్వారా పాకిస్తాన్కు నీరు చేరుతుంది. ఇప్పటికే చీనాబ్ నదిపై ఉన్న సలాల్ డ్యామ్ అన్ని గేట్లను భారత ప్రభుత్వం మూసివేసింది. దీంతో సోమవారం రియాసి జిల్లాలో నీట మట్టం గణనీయంగా పడిపోయింది. జమ్ము కాశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్లో భారీగా వర్షాలు పడడంతో ఈ నెల 2న చీనాబ్ నది నీటి మట్టం పెరిగింది.
జీలం నదిపై నిర్మించిన కిషన్గంగ డ్యామ్ నుండి పాక్కు చేరుతున్న నీటిని కూడా నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. జమ్మూలోని రాంబన్లో బాగ్లీహార్ జలవిద్యుత్ డ్యామ్ ఉండగా ఉత్తర కాశ్మీర్లో కిషన్గంగ జలవిద్యుత్ డ్యామ్ ఉంది. ఈ రెండు ఆనకట్టల నుండి నీటి విడుదలను భారత్ నియంత్రించవచ్చు. భారత్, పాకిస్తాన్ మధ్య బాగ్లీహార్ డ్యాంపై దీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఈ వివాదంలో ప్రపంచబ్యాంక్ జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంది. జీలంకు ఉపనది అయిన నీలంపై కిషన్గంగ డ్యాం ప్రభావం చూపుతుందంటూ పాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
సైనిక పరిష్కారం సరైన మార్గం కాదు : యుఎన్ చీఫ్
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సోమవారం సమావేశమై భారత్, పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై చర్చించింది. సైనిక పరిష్కారం అసలైన పరిష్కారం కాదని స్పష్టం చేసింది. పహల్గాం ఘటనకు కారకులైన వారికి కఠిన శిక్ష పడాల్సిందేనని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ పేర్కొన్నారు. ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగేలా కావాలంటే తాము సాయం చేస్తామని కూడా ఆయన ప్రతిపాదించారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.
బంకర్లకు మరమ్మతులు చేయాలి
జమ్మూ సరిహద్దు ప్రాంతాల్లోని బంకర్లకు అత్యవసరంగా మరమ్మ్తతులు చేయాలని సరిహద్దు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. పాకిస్తానీ పోస్టులకు కేవలం 500మీటర్ల దూరంలోని చందు చాక్ వంటి గ్రామాల్లో అనేక బంకర్లు వున్నాయి. కానీ వాటిల్లో చాలా వరకు పూర్తి కాకుండా వున్నాయి. మరికొన్ని శిధిలావస్థలో వున్నాయి. నీరు, విద్యుత్, టాయిలెట్లు వంటి ప్రాధమిక సదుపాయాలేవీ లేవని కొన్నిటికి పైకప్పులు కూడా లేవని ఆ గ్రామ నివాసి ఒకరు వాపోయారు.
కాల్పులకు తెగబడుతున్న పాక్ దళాలు
పాక్ సైనికులు వరుసగా 11వ రోజు కూడా నియంత్రణా రేఖ వెంబడి కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం రాత్రి జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెంధర్, నౌషేరా, సుందర్బని, అఖ్నూర్ ప్రాంతాలలోని సైనిక పోస్టుల నుండి కాల్పులు జరిగాయి. భారత దళాలు దీటుగా స్పందించి వాటిని వెంటనే తిప్పికొట్టాయి. ఇదిలావుండగా తాము భారత్కు చెందిన అనేక రక్షణ వెబ్సైట్లపై దాడి చేశామని, వాటిలోని డేటాను దొంగిలించామని పాక్ హ్యాకర్లు చెప్పుకున్నారు. దీనిపై కేంద్రం విచారణకు ఆదేశించింది.
పాకిస్తాన్ పౌర, సైనిక నాయకత్వం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి భారత్తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను వివరించింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్-ఐ-ఇన్సాఫ్ మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఈ సమావేశానికి హాజరయ్యాయి. ఒకవేళ భారత్ దుస్సాహసానికి పాల్పడితే తగిన విధంగా జవాబు చెప్పాలని ఆ పార్టీలు అభిప్రాయపడ్డాయి.
జపాన్ మద్దతు
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం జపాన్ రక్షణ శాఖ మంత్రితో జనరల్ నకతానితో భేటీ అయ్యారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూ లించడంతో సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. ద్వైపాక్షక రక్షణ సంబంధాలను విస్తరించుకోవాలని, అందుకు మార్గాలను అన్వేషించాలని ఇరువురు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న జనరల్ నకతాని పహల్గాం ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించారు.
ఉగ్రవాదంపై పోరుకు మద్దతిస్తామన్న పుతిన్
మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోడీకి ఫోన్ చేశారు. పహల్గాం దాడికి కుట్ర పన్నిన దుండగులను చట్టం ముందు నిలపాలన్నారు. ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ఆటవికమైనదిగా పుతిన్ అభివర్ణించారని రష్యా రాయబార కార్యాలయం తెలియజేసింది. ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరుకు పూర్తి మద్దతు ఇస్తామని పుతిన్ తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ దానిపై రాజీ లేని పోరాటం సాగించాల్సిన అవసరం ఉన్నదని పుతిన్, మోడీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది భారత్లో జరిగే ఇరు దేశాల సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాని కోరగా పుతిన్ అందుకు అంగీకరించారు.