శ్రీనగర్ : చీనాబ్లోయలోని కిష్త్వార్జిల్లాలో గుర్తుతెలియని ఉగ్రవాది మరణించినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ మూడవ రోజుకి చేరుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఒక ఉగ్రవాది మరణించారని, ప్రతికూల భూభాగం, వాతావరణం ఉన్నప్పటికీ భద్రతాదళాలు ఆపరేషన్ చేపడుతున్నారని లోయ ఇన్చార్జ్, ఆర్మీ వైట్ కార్ప్స్ ప్రతినిధి తెలిపారు. ఏప్రిల్ 9న కిష్త్వార్లోని ఛత్రు ఎగువ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో పోలీసులతో కలిసి సంయుక్తంగా గాలిస్తుండగా, కాల్పులు ప్రారంభమయ్యాయని అన్నారు.
జమ్ములోని ఉధంపూర్లో మరో ఎన్కౌంటర్ జరిగిందని సీనియర్ అధికారి తెలిపారు. ఈ ఏడాది జమ్మూలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయని అన్నారు. మార్చిలో ఎన్కౌంటర్లో నలుగురు పోలీసులు, ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని అన్నారు.
