- నిరుద్యోగం గురించి మాట్లాడరేం? : మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ : ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పేరును 758 సార్లు చెప్పుకున్నారని, కానీ నిరుద్యోగం గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. లోక్సభ ఎన్నికల తుది దశకు గురువారం ప్రచారానికి చివరిరోజు సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘గత 15 రోజుల్లో మోడీ తన ప్రసంగాల్లో కాంగ్రెస్ పేరును 232 సార్లు, తన పేరును 758 సార్లు ప్రస్తావించారు. కానీ నిరుద్యోగం గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు’ అని ఖర్గే అన్నారు. జూన్ 4 తరువాత ఇండియా వేదిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘జూన్ 4న ఈ దేశ ప్రజలు నూతన ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తారని మాకు నమ్మకం ఉంది. ఇండియా వేదిక పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మనమందరం కలిసి ఈ దేశానికి ఇండియా వేదిక ప్రభుత్వాన్ని అందిస్తాం. అందరినీ కలుపుకొని ముందుకు సాగుతాం’ అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు దేశంలోని ప్రతి పౌరుడు ఏకతాటిపైకి వచ్చినందుకు ఈ ఎన్నికలు చిరకాలం గుర్తుంటాయని అన్నారు. ‘మతం, విభజనతో ప్రజల్ని తప్పుదోవపట్టించేందుకు ప్రధాని, బిజెపి నాయకులు లెక్కలేనన్ని ప్రయత్నాలు చేశారు. అయినా ప్రజలు సమస్యలపై దృష్టి పెట్టారు. మేం కూడా సమస్యలపై ఓట్లు అడిగాం. ఈ మోడీ ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇస్తే ప్రజాస్వామ్యానికి ముగింపే అనే మా అభిప్రాయాన్ని ప్రజలు ఆమోదించారు’ అని ఖర్గే తెలిపారు. కులం, మతం ఆధారంగా ఓట్ల కోసం ప్రచారం చేయవద్దని ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ ప్రచారంలో మోడీ 421 సార్లు ‘మందిర్ – మసీద్’ వంటి అంశాలను ప్రస్తావించారని విమర్శించారు.