జెడ్డా : సౌదీ యువరాజు బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం జెడ్డా చేరుకున్నారు. మోడీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ గగనతలంలోకి ప్రవేశించగానే సౌదీ యుద్ధ విమానాలు ఎస్కార్టుగా వస్తూ మోడీకి స్వాగతం పలికాయి. గత 40 ఏళ్ళలో జెడ్డా నగరంలో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీనే. కాగా సౌదీలో పర్యటించడం మూడోసారి. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆరు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేస్తారని భావిస్తున్నారు. జెడ్డాకు బయలుదేరడానికి ముందుగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, రక్షణ, వాణిజ్య, పెట్టుబడులు, ఇంధన రంగాలతో సహా ఇరు దేశాల మధ్య గణనీయమైన భాగస్వామ్యం వుండాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రాంతీయ శాంతి సుస్థిరతలు, భద్రత, సంక్షేమాన్ని పెంపొందించేందుకు ఇరు పక్షాలు కట్టుబడి వున్నాయని చెప్పారు. ఇరు దేశాల ప్రజల మధ్య కూడా సంబంధాలు పెంపొందాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. సౌదీ అరేబియలోని భారతీయులను కలుసుకోవడానికి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
