న్యూఢిల్లీ : దేశ ప్రధానిగా నరేంద్ర మోడి మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు సాయంత్రం 7 గంటల 15 నిముషాలకు మోడితోపాటు కేంద్ర మంత్రివర్గంలో మరికొందరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడి స్వీకారోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అయిదు కంపెనీల పారామిలటరీ సిబ్బంది, ఎన్ఎస్జీ కమాండోలు, డ్రోన్లు, స్నిపర్లతో కట్టుదిట్టమైన భద్రత సిబ్బందిని మోహరించనున్నారు. రాష్ట్రపతి భవన్లో మోడి ప్రమాణ స్వీకారం జరగనున్న వేళ .. ప్రాంగణం లోపల, వెలుపల మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక ఆయుధాలు, వ్యూహాలు, ఎన్ఎస్జి నుంచి కమాండోలు ఈవెంట్ రోజున రాష్ట్రపతి ఇంటి చుట్టూ, వివిధ వ్యూహాత్మక ప్రదేశాల చుట్టూ మోహరిస్తారు. ఐదు కంపెనీల పారామిలటరీ, ఢిల్లీ సాయుధ పోలీసు (డిఎపి) జవాన్లతో సహా దాదాపు 2500 మంది పోలీసు సిబ్బందిని రాష్ట్రపతి భవన్ చుట్టూ మోహరించనున్నారు. ఈ కార్యక్రమానికి సార్క్ (సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) దేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో … గత సంవత్సరం జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాటు చేసిన భద్రతనే అధికారులు కల్పించనున్నారు. ప్రమాణస్వీకారానికి హాజరయ్యే ప్రముఖులకు వారి హోటళ్ల నుంచి వేదిక వద్దకు, తిరిగి వెళ్లేందుకు నిర్దేశిత మార్గాలను కూడా ఏర్పాటు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఢిల్లీలో నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు. జూన్ 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు ఆంక్షలు విధించారు. ఢిల్లీలో ఎలాంటి డ్రోన్, పారాగ్లైడింగ్, పారాజంపింగ్, రిమోట్ ఆపరేట్ చేసే ఏ రకమైన పరికరాలపైనా నిషేధం విధించారు.
