విల్లివాక్కం (తమిళనాడు) : తమిళనాడు డిఎంకె ఎంపి గణేశమూర్తి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఆదివారం కోవైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. దీంతో ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు వార్తలు హల్ చల్ చేశాయి. ఈ విషయం తెలిసి ఎండీఎంకేలో ఉద్రిక్తత నెలకొంది. అయితే గణేశమూర్తి కుటుంబీకులు ఈ విషయాన్ని నిర్థారించలేదు.
2019 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఎండీఎంకేకు ఈరోడ్ స్థానం కేటాయించగా గణేశమూర్తి ఉదయించే సూర్యుడి గుర్తుపై విజయాన్ని సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎండీఎంకేకు తిరుచ్చి కేటాయించగా దురైవైగోను అభ్యర్థిగా ప్రకటించారు. గణేశమూర్తికి మళ్లీ అవకాశం రాలేదు. దీంతో గత వారంరోజులుగా ఆయన మనోవేదనకు గురైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు అకస్మాత్తుగా గణేశమూర్తిని ఈరోడ్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుండి కోవైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో పార్టీలో సమస్యల కారణంగా గణేశమూర్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఆయన బంధువులు, పార్టీ వర్గీయులు నిర్ధారించలేదు.