ఫిరోజ్పుర్, ఉరీలో జనావాసాలపై పాక్ దాడి
36 ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగినట్లు ప్రకటించిన సైన్యం
త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ : భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నాడు కూడా పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ చేసిన దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పంజాబ్లోని ఫిరోజ్పూర్, కాశ్మీర్లోని ఉరీలో జనావాసాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు గాయపడినట్లు వార్తలు వచ్చాయి. క్షతగాత్రులను ఆస్పతులకు తరలించారు. ఈ సంఘటనతో ఫిరోజ్పూర్లో బ్లాక్ అవుట్ విధించారు. జమ్మూ-కాశ్మీర్లో కూడా బ్లాక్ అవుట్ కొనసాగుతోంది. రాత్రి పదిగంటల ప్రాంతంలో కశ్మీర్లోని అవంతిపొరా వైమానిక స్థావరంపై దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. అయితే, ఈ దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది. జమ్మూలో కాల్పులు, పేలుళ్ళ శబ్దాలు వినిపిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ప్రజలు ధైర్యంగా, సహనంగా ఉండాలని ఆయన కోరారు. జమ్మూతో పాటు, సాంబా, పఠాన్కోట్లలో పాక్ డ్రోన్దాడులు కొనసాగాయి. ఉరి సెక్టార్లో కూడా పాక్సైనికులు మరోసారి కాల్పులు జరిపారు. ఇక్కడి జనావాసాల్లో పెద్దఎత్తున పేలుళ్ల శబ్దాళు వినిపించినట్లు వార్తలు వచ్చాయి. ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం సాయంత్రం త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కూడా ప్రధానితో సమావేశమయ్యారు. కొందరు మాజీ సైనికాధికారులు కూడా ప్రధానిని కలిశారు. 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్ దాడులకు దిగినట్లు భారత సైన్యం ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు ఈ వివరాలు తెలిపారు. జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాదాపు 400 డ్రోన్లతో పాక్ ఈ దాడులను చేసినట్లు వారు తెలిపారు. పాకిస్తాన్ పౌర విమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగించుకుంటోందని తెలిపారు.
ఏడుగురు చొరబాటుదారులు హతం
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్లోని సాంబ జిల్లాలో సరిహద్దు దాటి భారత్లో చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బిఎస్ఎఫ్ తిప్పికొట్టింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో సాంబ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఈ పరిణామాలు చోటుచేసుకొన్నటు బిఎస్ఎఫ్ వెల్లడించింది. ఏడుగురు చొరబాటుదారుల్ని హతమార్చినట్లు తెలిపింది. దీంతోపాటు పాక్కు చెందిన ధన్బార్లోని పోస్టును భారత దళాలు ధ్వంసం చేశాయి.
త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం త్రివిధ దళాధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ దాడులకు తెగబడుతున్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో సిడిఎస్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కూడా పాల్గొన్నారు. అంతకుముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో, విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అలాగే, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ మిలిటరీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వీరిలో సిడిఎస్ అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు ఉన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో ప్రధాని మాట్లాడారు. భద్రతా సన్నద్ధతపై ప్రధాని ఆరాతీసి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భద్రతాపరంగా సున్నిత ప్రాంతాలైన కచ్, బనస్కంతా, పటాన్, జామ్నగర్లో పౌరుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి అడిగారు.
ఆర్మీ చీఫ్కు మరిన్ని అధికారాలు
పాకిస్థాన్తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని స్పష్టం చేసింది. ఇందులోని అధికారులను, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిచేందుకు అధికారం కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది. టెరిటోరియల్ లేదా ప్రాదేశిక ఆర్మీ అంటే సైనిక రిజర్వ్ ఫోర్స్. దేశంలో క్లిష్టపరిస్థితులు ఎదురైనప్పుడు భారత ఆర్మీతో కలిసి ప్రత్యర్థితో తలపడేందుకు టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. ఇందులోని సిబ్బంది, అధికారులకు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే శిక్షణ ఇస్తారు. వీరంతా బయట ఉద్యోగాలు చేసుకుంటూనే వాలంటరీగా సైన్యంతో పనిచేస్తుంటారు. 1948లో భారత టెరిటోరియల్ ఆర్మీ చట్టం ఆమోదించారు. ఆ తర్వాత 1949లో అధికారికంగా ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 50 వేల మంది వరకు ఈ ఆర్మీలో ఉన్నట్లు సమాచారం. వీరంతా రెగ్యులర్ ఆర్మీలో భాగమే అయినప్పటికీ.. నిరంతరం సైన్యంతోనే ఉండరు. అవసరమైన సందర్భాల్లో కదన, ప్రకతి వైపరీత్యాల్లో రంగంలోకి దిగుతారు. 1962, 1965, 1971 యుద్ధాల్లో భారత సైన్యంతో కలిసి టెరిటోరియల్ ఆర్మీ పనిచేశారు.
14 వరకూ పలు విమానాశ్రయాల మూసివేత
దేశంలో 24 ఎయిర్పోర్టుల మూసివేతను కేంద్రం పొడిగించింది. ఈ నెల 14 వరకు మూసివేత అమలులో ఉంటుందని శుక్రవారం కేంరదం పేర్కొంది. చండీగఢ్, అమృత్సర్, లూధియానా, భుంటార్, కిషన్గఢ్, పాటియాలా, సిమ్లా, జైసల్మేర్, పఠాన్కోట్, శ్రీనగర్, జమ్మూ, బికనీర్, లేV్ా, పోర్బందర్, ఇతర నగరాల్లోని విమానాశ్రయాలు మే 14 వరకు మూసివేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేV్ా, చండీగఢ్, ధర్మశాల, బికనీర్, జోధ్పూర్, కిషన్గఢ్, రాజ్కోట్లకు అన్ని విమానాలను రద్దు చేసినట్లు ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రకటించింది.
మరోవైపు భద్రతా ప్రోటోకాల్స్ వల్ల ఢిల్లీ విమానాశ్రయంలో విమాన సేవలపై తీవ్ర ప్రభావం పడింది. శుక్రవారం మొత్తం 138 దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేశారు.
కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసిన కేరళ
దేశంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలలోని కుటుంబాలు, విద్యార్థులు సహా కేరళీయులకు సహాయం చేయడానికి కేరళ ప్రభుత్వం 24/7 హెల్ప్లైన్లతో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. తిరువనంతపురంలోని ప్రభుత్వ సచివాలయంలో కంట్రోల్ రూమ్లు పనిచేస్తాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఈ నంబర్లు 0471-2517500/2517600, ఫ్యాక్స్: 0471-2322600.