- ఎన్డిఎ ఓటమి కోసం ఉమ్మడి కృషి
- సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబి
- ఆర్జెడి నేత తేజస్వి యాదవ్తో సిపిఎం బృందం భేటీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బీహార్లో ఎన్డిఎను ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబి తెలిపారు. పాట్నాలో మహాఘట్బంధన్ సమన్వయ కమిటీ కన్వీనర్, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్తో మంగళవారం సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ దావలే, బీహార్ రాష్ట్ర కార్యదర్శి లాలన్ చౌదరి, కేంద్ర కమిటీ సభ్యుడు అవధేష్ కుమార్, అసెంబ్లీలో సిపిఎం శాసనసభా పక్షనేత అజరు కుమార్తో కలిసి ఎంఎ బేబీ భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, శాసన ఎన్నికల గురించి సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంఎ బేబి మాట్లాడుతూ మహాఘట్బంధన్ను బలోపేతం చేయడానికి వామపక్షాల కృషి కొనసాగుతుందని చెప్పారు.
సమన్వయంతో కూడిన ప్రతిపక్ష వ్యూహం అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. బీహార్లో ప్రభుత్వ మార్పు అనివార్యమని పేర్కొన్నారు. బిజెపి, సంఫ్ు పరివార్ ప్రోత్సహిస్తున్న మతతత్వాన్ని ఓడించడానికి అన్ని లౌకిక పార్టీలు ఐక్యంగా పోరాడాలని సూచించారు. ఈ నెల 20న జరిగే సార్వత్రిక సమ్మెకు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలవడంతో ప్రతిపక్షాల ఐక్యత, సంకల్పం స్పష్టమైందన్నారు. తేజస్వి యాదవ్ మాట్లాడుతూ బీహార్లో మహాఘట్బంధన్ సామరస్యంగా ముందుకు సాగుతోందన్నారు. సీట్ల చర్చలు పురోగమిస్తున్నాయని చెప్పారు. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగడంపై ప్రజలకు ఆసక్తి లేదని తేజస్వి అన్నారు.
భోగేంద్ర యాదవ్ విగ్రహావిష్కరణ
ఈ బేటీకి ముందు మధుబని జిల్లా హుస్సేన్పూర్ గ్రామంలో సిపిఎం నాయకులు భోగేంద్ర యాదవ్ విగ్రహాన్ని ఎంఎ బేబి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో బేబి మాట్లాడుతూ మధుబని జిల్లాలో వామపక్షాల నేతృత్వంలో పోరాటాల అద్భుతమైన వారసత్వాన్ని ప్రస్తావించారు. పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దారుణమైన దాడిని ఖండిస్తూ, ఉగ్రవాదానికి మతం లేదని నొక్కిచెప్పారు. అయితే ప్రజలను మతం పేరుతో రెచ్చగొట్టడానికి ఆర్ఎస్ఎస్-బిజెపి చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ ధావలే, రాష్ట్ర కార్యదర్శి లాలన్ చౌదరి, కేంద్ర కమిటీ సభ్యులు అవధేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఎమ్మెల్యే అజరు కుమార్, రాంపరి దేవి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామ్ నరేష్ పాండే, ఆర్జెడి రాజ్యసభ ఎంపి ఫయాజ్ అహ్మద్, సిపిఎం నాయకులు మనోజ్ కుమార్ యాదవ్, షీలా దేవి తదితరులు ప్రసంగించారు.