న్యూఢిల్లీ : ఉత్తరభారతాన్ని పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కప్పుకుపోవడంతో 100కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. ఢిల్లీతో సహా యుపి, పంజాబ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేయడంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. ఈ కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విజిబిలిటీ జీరోకు పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వందకుపైగా విమానాలు ఆలస్యమయ్యాయి. కొన్ని విమానాలు రద్దయ్యాయి. ఇక కోల్కతా విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 12 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ మానిటరింగ్ ప్లాట్ఫామ్ ఫ్లైట్రాడార్ ప్రకటించింది.