న్యూఢిల్లీ : సీసాలలో ప్యాక్ చేసి విక్రయించే తాగునీరు, మినరల్ వాటర్ సురక్షితమైనదని భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయం సరైంది కాదని దేశీయ ఆహార నియంత్రణ సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్డాండర్డ్స్ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఎఐ) తేల్చేసింది. ప్యాకేజ్డ్ తాగునీరు, మినరల్ వాటర్…ఈ రెండింటితోనూ ముప్పుందని స్పష్టం చేసింది. ఈ నీటిని నిరంతరం పరీక్షిస్తూ, తనిఖీలు నిర్వహిస్తూ కఠినమైన రక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. ప్యాకేజ్డ్ తాగునీటికి, మినరల్ వాటర్కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) సర్టిఫికేషన్ అవసరం లేకుండా అక్టోబరులో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్యాకేజ్డ్ తాగునీటిని, మినరల్ వాటర్ను ఉత్పత్తి చేసే వారు, ప్రాసెస్ చేసే వారు లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందడానికి ముందు విధిగా తనిఖీలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం గత నెల 29వ తేదీ నుండే అమలులోకి వచ్చింది.