- నలుగురు చిన్నారులు సహా 15 మంది పౌరుల మృతి
- మరో 38 మందికి గాయాలు
- సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
శ్రీనగర్ : ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత దళాలు క్షిపణి దాడులు జరపడంతో అందుకు ప్రతిగా పాక్ సాయుధ దళాలు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలపై పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో నలుగురు చిన్నారులు సహా కనీసం 15 మంది మరణించారు. మరో 38 మందికి గాయాలయ్యాయి.
పూంచ్లో పాక్ దళాల కాల్పుల్లో ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారు. మంగళవారం రాత్రి పాక్ సైనికులు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న సైనిక పోస్టుల నుండి ఏకపక్షంగా కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. కాగా సరిహద్దు వెంబడి ఉన్న పలు సెక్టార్లు కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నాయి. పూంచ్ జిల్లాలోని కిషన్ ఘాటీ, షాపూర్, మాన్కోటేలోనూ, రాజౌరి జిల్లాలోని లామ్, మంజాకోట్, గంబీర్ బ్రహ్మణలోనూ భారత్, పాకిస్తాన్ దళాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. కాశ్మీర్లోని యురి, తంగ్దార్ సెక్టార్లలో కూడా భారీగా కాల్పులు కొనసాగుతున్నాయి.
భారత్, పాక్ దళాల మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా సరిహద్దు ప్రాంతాలలో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. సరిహద్దు జిల్లాలైన జమ్ము, సాంబా, కతువా, రాజౌరి, పూంచ్లో భద్రతా కారణాల దృష్ట్యా పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జమ్ము, శ్రీనగర్, లెహ్ సహా సరిహద్దుకు సమీపంలో ఉన్న విమానాశ్రయాలను మూసివేశారు. ఉత్తరాదిన ఉన్న అనేక నగరాలకు ఎయిర్ ఇండియా సంస్థ విమాన సర్వీసులను కొంతసేపు నిలిపివేసింది. పాకిస్తాన్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భీమ్బర్ గాలి సెక్టారులో కాల్పులు జరిపాయని సైన్యం తెలిపింది. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న పలు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.