న్యూఢిల్లీ : లోక్సభలో బుధవారం ప్రతిపక్ష భ్యులు మణిపూర్ సంక్షోభంపై, అదానీ వ్యవహారంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాపడింది. ఈరోజు సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గోగోరు మణిపూర్ అంశాన్ని లేవనెత్తారు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న హింస వల్ల మణిపూర్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక సేవలకు నోచుకోలేకపోతున్నారు. ఈ ప్రభావం సాధారణ ప్రజలపై తీవ్రంగా పడుతోందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మణిపూర్లో ఎప్పుడు పర్యటిస్తారు? అని ప్రశ్నించారు? మణిపూర్లో పరిస్థితిని పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పుడు సభకు తెలియజేస్తారు? అని గగోరు ప్రశ్నించారు. మణిపూర్ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే జార్జ్ సోరోస్ అంశాన్ని బిజెపి లేవనెత్తిందని ఈ సందర్భంగా గగోరు ఆరోపించారు.
కాగా, మరోవైపు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ వ్యవహార తీరుపై అసంతృప్తి చెందిన ప్రతిపక్షనేతలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసులిచ్చింది. అయితే అవిశ్వాస తీర్మానంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.
అదానీ ముడుపుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ప్రధాని మోడీ నోరు విప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంపై పార్లఎమంటులో చర్చ పెట్టాలని ప్రతిపక్షలు నోటీసులిచ్చినా కేంద్ర ప్రభుత్వం మాత్రం పార్లమెంటు ఉభయ సభల్లోనూ చర్చ పెట్టనివ్వడం లేదు. అసలు పార్లమెంటు సమావేశాలనే సజావుగా జరిగేలా ప్రయత్నించడం లేదు. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన వెంటనే వాయిదాలు పడుతున్నాయి. బుధవారం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే సభ్యులు వివిధ అంశాలపై చర్చించాలంటూ పట్టుబట్టారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
కాగా, లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణశాఖా మంత్రి రాజ్నాథ్సింగ్ లోక్సభకు వచ్చారు. ఈరోజు లోక్సభలో క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ 2024 కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ మంత్రి సరబానంద సోనేవాల్ ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే (సవరణ) బిల్లు 2024ను ప్రవేశపెట్టపెట్టన్నారు. కేంద్ర హోంమంత్రి విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు 2024 ప్రవేశపెట్టనున్నారు.