- ఢిల్లీ పోలీసుల తీరును ఖండించిన సిపిఎం
న్యూఢిల్లీ : పామ్ సండే సందర్భంగా నిర్వహించే సాంప్రదాయ కార్యక్రమం వార్షిక శిలువ ఊరేగింపునకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రతి ఏడాది గుడ్ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారం ఓల్డ్ ఢిల్లీలోని సెయింట్ మేరీ చర్చ్ నుంచి గోలే డాక్ ఖానా వరకూ ప్రశాంతంగా ఈ ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పోలీసులు అనుమతి నిరాకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఢిల్లీ పోలీసుల నిర్ణయాన్ని సిపిఎం తీవ్రంగా ఖండించింది. శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యలు సాకుగా చూపుతూ ఊరేగింపునకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పని దినాలు, రద్దీ సమయాల్లోనూ వివిధ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి ఇచ్చిన పోలీసులు ఇప్పుడు తిరస్కరించడం వింతగా అనిపిస్తుందని సిపిఎం పేర్కొంది. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటారు కాబట్టి, ఇప్పటి వరకూ ప్రతి ఏడాది అత్యంత క్రమశిక్షణగా, శాంతియుతంగా, అధికారులకు పూర్తిగా సహకరిస్తూ నిర్వహించిన ఈ వేడుకకు ఈ ఏడాది ఎందుకు అనుమతి నిరాకరించారో కేంద్ర హోం మంత్రే సమాధానం ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది. అనుమతి నిరాకరించడం ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వ నిరంకుశ, మైనార్టీ వ్యతిరేక వైఖరికి మరో ఉదాహరణ అని విమర్శించింది. అన్ని మతాలను సమానంగా చూసేలా, అన్ని మతాలకు ఇచ్చిన రాజ్యాంగ స్వేచ్ఛను నిలబెట్టేలా భారత ప్రభుత్వం కట్టుబడి ఉండాలని సిపిఎం విజ్ఞప్తి చేసింది.