రాష్ట్రపతితో ప్రధాని భేటీ

May 8,2025 00:32 #3-nation, #cancelled, #PM Modi, #Visit
  • మోడీ యూరప్‌ పర్యటన వాయిదా
  • నేడు అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ : ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. పాకిస్తాన్‌ ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం జరిపిన దాడుల గురించి రాష్ట్రపతికి వివరించారు. ఆపరేషన్‌ సిందూర్‌, సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోడీ తన యూరప్‌ పర్యటనను వాయిదా వేసుకున్నారు. మరోవైపు పాకిస్తాన్‌, నేపాల్‌ దేశాల పొరుగున ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు, అధికారులు హాజరయ్యారు. పాకిస్తాన్‌లో కానీ, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో కానీ పౌరులు, వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రతిపక్షాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది.
కాగా, మరోవైపు సెలవులో ఉన్న సిబ్బందిని వెంటనే వెనక్కి పిలిపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్ని పారా మిలటరీ దళాల అధిపతులకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అలాగే, జమ్మూకాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాతో అమిత్‌షా నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు.

అమాయకులను హత్య చేసిన వారినే హతమార్చాం : రాజ్‌నాథ్‌ సింగ్‌

ఆపరేషన్‌ సిందూర్‌ గురించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ కేవలం మన అమాయక ప్రజలను హత్య చేసినవారినే హతమార్చామని అన్నారు. ఈ ఆపరేషన్‌ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి జవాబిచ్చామని పేర్కొన్నారు. రాత్రికిరాత్రి మన సైనికులు చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

➡️