న్యూఢిల్లీ : న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టపర్లుక్సాన్ భారత్లో పర్యటించనున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆయన మార్చి 16న భారత్కు రానున్నట్లు విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది. వాణిజ్యం, పెట్టుబడులు సహా పలు కీలకమైన అంశాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయనున్నట్లు తెలిపింది.
ప్రధాని మోడీతో చర్చలు జరపడంతో పాటు మార్చి 17న న్యూఢిల్లీలో జరగనున్న 10వ రైసినా డైలాగ్ ప్రారంభ సమావేశంలో క్రిస్టపర్ ముఖ్య అతిథిగా పాల్గని కీలక ప్రసంగం చేయనున్నారని విదేశాంగ శాఖ పేర్కొంది. మార్చి 17న భారత్-న్యూజిలాండ్ సంబంధాలు సహా పలు అంశాలు ప్రధానితో చర్చించనున్నారు. రాష్ట్రపతితో సమావేశమైన అనంతరం ప్రధాని మోడీ ఇచ్చే ప్రత్యేక విందులో పాల్గొననున్నారు.
న్యూజిలాండ్ ప్రధానితో పాటు మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు, మీడియా, అత్యున్నత స్థాయి ప్రతినిధులు సహా పలువురు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం భారత్లో పర్యటించనుంది. మార్చి 19, 20 తేదీలలో ముంబయిలో కూడా పర్యటించనున్నారని తెలిపింది.
న్యూజిలాండ్ ప్రధాని హోదాలో ఇది క్రిస్టపర్ లుక్సాన్ భారత్లో మొదటి పర్యటన కానుంది.