Bhagwant Mann : పంజాబ్‌లో మిగులు జలాలు లేవు

ధర్మశాల : తమ రాష్ట్రంలో మిగులు జలాలు లేవని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ పేర్కొన్నారు. చట్టపరమైన, సంబంధిత డేటా ఆధారాలు రాష్ట్ర వైఖరికి మద్దతు ఇస్తున్నాయని స్పష్టం చేశారు.  ఏప్రిల్‌ 30న భాక్రా -నంగల్‌ ఆనకట్ట నుండి హర్యానాకు అదనంగా 8,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఇటీవల భాక్రా బియాస్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (బిబిఎంబి) ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులపై సోమవారం భగవంత్‌ మాన్‌ మీడియాతో మాట్లాడారు.
‘‘ హర్యానాతో నీటి విషయంలో ఎటువంటి వివాదం లేదు. చట్టపరంగా మరియు డేటా ప్రకారం.. ఇది పంజాబ్‌కు అనుకూలంగా ఉంది. మేము హర్యానాకు ఒక సంవత్సరం నీటిని కేటాయించాము. వారు10 నెలలు నీటిని వినియోగించుకున్నారు. మిగిలిన రెండు నెలలకు అదనపు నీటిని కోరుతున్నారు ’’ అని అన్నారు. అధికంగా నీరు లభించే గతకాలం ఆధారంగా హర్యానా అభ్యర్థన ఉందని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని అన్నారు. పంజాబ్‌లో కాలువలను అభివృద్ధి చేశామని, కాలువ నీటి వినియోగాన్ని 21-22 శాతం నుండి 60 శాతానికి పెంచామని అన్నారు.  ప్రస్తుతం తమ  సొంత నీటినే వినియోగిస్తున్నామని, రాష్ట్రంలో మిగులు జలాలు లేవని అన్నారు.

➡️