న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి రష్యా పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్లో పేర్కొన్నారు. ఈ దారుణమైన దాడికి పాల్పడిన వారిని, వారికి మద్దతు ఇచ్చిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. భారత్-రష్యా వ్యూహాత్మక బాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాల అధ్యక్షులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారని అన్నారు. రష్యా విక్టరీ డే 80వ వార్షికోత్సవం సందర్భంగా పుతిన్కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఏడాది చివరలో భారత్లో జరగనున్న భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ పుతిన్ను ఆహ్వానించారు. మోడీ ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించారని క్రెమ్లిన్ సోమవారం తెలిపింది.
