లక్నో : కొనసాగుతున్న న్యాయవాదుల సమ్మె కారణంగా కాంగ్రెస్ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీపై పరువునష్టం కేసు విచారణ బుధవారం మరోసారి వాయిదా పడింది. ఈ కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ను పూర్తి చేసేందుకు ప్రత్యేక ఎంపి-ఎమ్మెల్యె జడ్జి శుభమ్ వర్మ తదుపరి విచారణను జనవరి 30కి వాయిదా వేశారు.
2018లో స్థానిక బిజెపినేత విజయ్ మిశ్రా రాహుల్గాంధీపై పరువునష్టం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటక ఎన్నికల సమయంలో రాహుల్గాంధీ బిజెపి నేత అమిత్షా మనోభావాలను దెబ్బతీసేలా, అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రాహుల్గాంధీ విచారణకు హాజరుకాకపోవడంతో ఈ కేసు ఐదేళ్లపాటు పెండింగ్లో ఉంది. దీంతో 2023 డిసెంబర్లో కోర్డు సమన్లతో పాటు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2024 ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ కోర్టులో లొంగిపోగా, అదే ఏడాది జులై 26న ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. రూ.25,000 చొప్పున ఇద్దరి పూచీకత్తుపై ప్రత్యేక మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.
తాను నిర్దోషినని, తనపై రాజకీయ కుట్రజరుగుతోందని కోర్టుకు తెలిపారు. ఈకేసులో ఆధారాలు సమర్పించాల్సిందిగా కోర్టు విజయ్ మిశ్రాను ఆదేశించింది.
2024 డిసెంబర్ 16న విచారణ జరగాల్సి వుండగా, జడ్జి గైర్హాజరుకావడంతో వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి 2న క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తికాకపోవడంతో తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా వేసింది. అయితే లాయర్ల సమ్మె కారణంగా విచారణను జనవరి 22కి వాయిదా వేశారు. లాయర్ల సమ్మె కొనసాగుతుండటంతో నేడు విచారణ మరోసారి వాయిదా పడింది.