defamation case : పరువునష్టం కేసులో యుపి కోర్టుకు రాహుల్‌

లక్నో /సుల్తాన్‌పూర్‌ : పరువునష్టం కేసులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సుల్తాన్‌పూర్‌లోని ఎంపి-ఎమ్మెల్యే కోర్టు ఎదుట శుక్రవారం హాజరయ్యారు. ప్రత్యేక న్యాయమూర్తి శుభం వర్మ ఎదుట హాజరై, తన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి కేసు తదుపరి విచారణను ఆగస్ట్‌ 12కి వాయిదా వేశారు. తదుపరి విచారణకు రాహుల్‌ గాంధీ కోర్టుకు హాజరుకానవసరం లేదని తెలిపారు. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2018 ఆగస్టు 4న స్థానిక బిజెపి నేత విజరు మిశ్రా రాహుల్‌గాంధీపై ఈ కేసు దాఖలు చేశారు. విచారణ అనంతరం రాహుల్‌ తరపున న్యాయవాది కాశీ ప్రసాద్‌ శుక్లా మీడియాతో మాట్లాడారు. పరువు నష్టం కేసుకు దారితీసే విధంగా ఎవరిపైనా రాహుల్‌గాంధీ తప్పుడు ప్రకటన చేయలేదని అన్నారు. తేలిగ్గా ప్రచారం పొందేందుకు ఈ కేసు దాఖలు చేశారని చెప్పారు. రాహుల్‌గాంధీ ఉదయం 11 గంటలకు కోర్టుకు రావడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. కోర్టు ఎదుట భారీస్థాయిలో భద్రతా బలగాలను మోహరించారు. రారుబరేలీ నుండి విమానంలో లక్నో చేరుకున్న రాహుల్‌ గాంధీ రోడ్డు మార్గంలో సుల్తాన్‌పూర్‌లోని కోర్టుకు వచ్చారు.

➡️