న్యూఢిల్లీ : పాకిస్తాన్ ప్రతీకార దాడిని తిప్పికొట్టినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ప్రకటించారు. జమ్ముకాశ్మీర్, పంజాబ్, గుజరాత్సహా దేశంలోని 15 ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు లక్ష్యంగా పాక్ ప్రయోగించిన డ్రోన్లను నిరోధించినట్లు తెలిపారు. దాడులకు ప్రతిగా పాకిస్తాన్లోని లాహోర్ సహా పలు ప్రాంతాల్లోని వైమానిక రక్షణ రాడార్లను ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున (మే 7,8 తేదీలలో) దేశంలోని అవంతిపుర, శ్రీనగర్, జమ్ము, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, అదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరలై మరియు భుజ్లోని సైనిక స్థారవాలను లక్ష్యంగా పాక్ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని రక్షణ శాఖ తెలిపింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎఎస్ గ్రిడ, వైమానిక రక్షణ వ్యవస్థలతో సమర్థవంతంగా అడ్డుకున్నట్లు తెలిపింది. పాకిస్తాన్ దాడులకు సాక్ష్యంగా వాటి శకలాలను ఆయాప్రాంతాల నుండి సేకరిస్తున్నట్లు తెలిపింది. ప్రతిగా భారత్ పాకిస్తాన్ రాడార్, వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుందని, లాహోర్లోని వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసమైనట్లు వెల్లడించింది.
బుధవారం జమ్మూకాశ్మీర్లోని నియంత్రణ రేఖ (ఎల్ఒసి)కి సమీపంలోని నాలుగు జిల్లాల్లోని గ్రామాలపై పాక్ సైన్యం భారీ మోర్టార్లతో కాల్పులకు పాల్పడటంతో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 12 మంది మరణించగా, 51 మంది గాయపడ్డారని తెలిపింది. పూంచ్ సెక్టార్లోని ఎల్ఒసికి సమీపంలో పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో ఒక జవాను మరణించినట్లు ప్రకటించింది.