- ‘ఆపరేషన్ సిందూర్’ పై ట్రేడ్మార్క్ కోసం దరఖాస్తు
- ప్రజాగ్రహంతో నష్టనివారణ నాటకం
ముంబయి : దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థ, బిజెపికి ప్రతి యేటా భారీగా విరాళాలు కుమ్మరించే రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్ బరితెగించింది. సైనికుల విజయోత్సవాన్ని సైతం సరుకుగా మార్చి సొమ్ము చేసుకోవాలని వినాశకర చర్యలకు పూనుకుంది. ఉగ్ర మూకలపై వీర జవాన్ల విజయగీతిక ‘ఆపరేషన్ సిందూర్’పై ట్రేడ్ మార్క్ హక్కులు మంజూరు చేయాలంటూ రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్కు చెందిన జియో స్టూడియోస్ నిస్సిగ్గుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్, ట్రేడ్ మార్క్స్కు ఈ నెల 7న దరఖాస్తు చేసుకుంది. ఇది కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన పారిశ్రామిక ప్రోత్సహకం, అంతర్గత వాణిజ్యం విభాగం కింద పనిచేస్తుంది. ట్రేడ్ మార్క్కు సంబంధించిన చట్టాల్లోని ‘వస్తువులు, సేవలు’ విభాగంలో విద్య, వినోదాత్మక (చలనచిత్రాలు..తదిరాలు) సేవల కింద రిలయన్స్ ఈ దరఖాస్తు చేసుకుంది. ఆపరేషన్ సిందూర్ గురించి సైన్యం ప్రకటన విడుదల చేసిన రోజునే దరఖాస్తు చేయడం గమనార్హం. రిలయన్స్తో పాటు ఢిల్లీకి చెందిన అలోక్ కొఠారి అనే న్యాయవాది, గ్రూపు కెప్టెన్ కమల్ సింగ్ అనే మాజీ ఆర్మీ అధికారి కూడా ‘ఆపరేషన్ సిందూర్’పై ట్రేడ్ మార్క్కు దరఖాస్తు చేశారు.
దేశ వనరులను దోచుకుంటూ ఆసియాలోనే అత్యంత సంపన్నవంతుడిగా రికార్డులకెక్కిన ముఖేష్ అంబానీ డబ్బు కోసం ఎంతటి నీచానికైనా తెగిస్తాడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రజలు దుమ్మెత్తిపోశారు. సరిహద్దు ప్రాంత ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చిగురుటాకులా వణికిపోతున్న పరిస్థితిలోనూ వారంతా సైన్యానికి సహకరిస్తుంటే ఆ త్యాగాలను సైతం సొమ్ము చేసుకోవాలనే నీచమైన వ్యాపార కుసంస్కృతి నశించాలంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రిలయన్స్ ఇండిస్టీస్ దిగొచ్చింది. నష్ట నివారణకు చర్యలు చేపట్టింది. ట్రేడ్మార్క్కు దరఖాస్తు చేయాలనే ఉద్దేశ్యమే తమకు లేదని, జూనియర్ ఉద్యోగి చేసిన తప్పిదమంటూ నష్ట నివారణ నాటకాలు ఆడింది. ‘ఆపరేషన్ సిందూర్’పై ట్రేడ్మార్క్ దరఖాస్తును వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి ‘ఏజెంట్గా ఉద్యోగి చేసే పనికి ప్రిన్సిపల్గా సంస్థ యజమానే బాధ్యత’ అన్న సాధారణ వ్యాపార సిద్ధాంతం కూడా తెలియదా అంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు.
తీవ్రంగా ఖండించిన సిపిఎం
రిలయన్స్ తీరును సిపిఎం కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పెద్ద ఎత్తున విమర్శలు, ఒత్తిళ్లు రావడంతోనే ‘ఆపరేషన్ సిందూర్’పై ట్రేడ్ మార్క్ దరఖాస్తును రిలయన్స్ ఇండిస్టీస్ వెనక్కి తీసుకుందని పేర్కొంది. లాభాల కోసం ఇంతటి బరితెగింపు చర్యకు పాల్పడి ఆ తప్పిదాన్ని చిరుద్యోగిపైకి నెట్టేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని నిలదీసింది.