- షబీర్ షాను విడుదల చేయాలంటూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ : ఉగ్ర కార్యకలాపాలకు నిధులను సమకూర్చారన్న ఆరోపణలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కాశ్మీరీ వేర్పాటు వాది షబీర్ షాకు ఊరట లభించింది. ఆయనను విడుదల చేయాలంటూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో నిర్దేశించిన ఏడేండ్ల శిక్షలో గరిష్టంగా షబీర్ షా అనుభవించాడని పాటియాలా హౌజ్ కోర్ట్స్ అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ ధీరజ్ మోర్ అన్నారు. 2017, జులై 26 నుంచి ఆయన జైలులో ఉన్నారని న్యాయమూర్తి తెలిపారు. సీఆర్పీసీ సెక్షన్ 436ఎ ప్రకారం ఆయన(షబీర్) విడుదల కావటానికి అర్హుడని చెప్పారు. కాగా, గరిష్ట శిక్షలో సగం కాలం ఆయన జైలులో ఉన్నాడన్న కారణంగా జూన్లో జడ్జి.. షబీర్కు బెయిల్ను మంజూరు చేశారు. షబీర్ను విడుదల చేయాలని కోర్టు నుంచి ఆదేశాలు జారీ అయినప్పటికీ.. మరో రెండు కేసులలో ఆయన జైలులోనే ఉండనున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లు ఆయనపై ఈ రెండు కేసులను నమోదు చేశాయి.