అస్సాం : అస్సాంలోని డిమా హసావో జిల్లాలో బొగ్గు గనిలో 9 మంది కార్మికులు చిక్కుకున్నారు. జనవరి 6వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. నేడు (జనవరి 9 గురువారం) కూడా బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు ఎన్డిఆర్ఎఫ్ బృందం తీవ్రం కృషి చేస్తోంది. గురువారం రోజు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్) టీమ్ కమాండర్, ఇన్స్పెక్టర్ రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మేము గనిలో చిక్కుకున్న కార్మికుల్ని కనిపెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాము. కానీ ఇప్పటివరకూ మేము వారి జాడ కనుగొనలేదు. ఈ ఆపరేషన్లో సోనార్ పరికరాలను ఉపయోగిస్తున్నాము. నీటిని బయటకు పంపేందుకు భారీగా పంపులను ఉపయోగిస్తున్నాము. గనిలో నీరు చేరడం ప్రధాన అడ్డంకిగా మారింది. నీటిమట్టం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. నేవీ, ఎన్డిఆర్ఎఫ్, భారత ఆర్మీ బృందాలు సంయుక్తంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి’ అని ఆయన అన్నారు.