- మోడీ ప్రభుత్వంపై ఖర్గే విమర్శలు
న్యూఢిల్లీ : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే ఉద్దేశం మోడీ ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. బిజెపి-ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగ నిర్మాతకు శత్రువులని అన్నారు. ‘మోడీ ప్రభుత్వానికి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్పై గౌరవం మాటలకే పరిమితం. ఆయన ఆశయాలను నెరవెర్చే ఉద్దేశం వారికి లేదు. ఆయన వారసత్వంపై పెదవి విరుస్తున్నారు. 1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి ఎస్ ఏ డాంగే, వీడీ సావర్కర్లు కారణం. ఈ విషయాన్ని అంబేద్కర్ ఒక లేఖలో పేర్కొన్నారు” అని ఖర్గే వ్యాఖ్యానించారు. అలాగే, దేశవ్యాప్తంగా కులగణన అవసరాన్ని ఖర్గే నొక్కి చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎస్సి, ఎస్టి, ఒబిసి రిజర్వేషన్లు అమలుచేయాలని అన్నారు. ”రాజ్యాంగం.. పౌరులకు అంబేద్కర్ ఇచ్చిన బహుమతి. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం పొందే హక్కును కల్పిస్తుంది. ఏఐసీసీ సమావేశంలో సామాజిక న్యాయానికి సంబంధించిన అభిప్రాయాలను ముందుకు తీసుకెళుతున్నాం” అని అన్నారు.