అదానీని కాపాడండి

ట్రంప్‌ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న కంపెనీ భారత ప్రతినిధులు

న్యూయార్క్‌ : అమెరికాలో వచ్చిన క్రిమినల్‌ ఆరోపణల నుండి పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీని బయటపడేసేందుకు అదానీ గ్రూప్‌ నానా తంటాలు పడుతోంది. అందులో భాగంగా ట్రంప్‌ ప్రభుత్వంలోని కొందరు అధికారులతో సమావేశమైందని బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడైన అదానీకి, అమెరికా ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న చర్చలు ఇప్పటివి కావని, ఈ సంవత్సరం ప్రారంభం నుండే అవి కొనసాగుతున్నాయని ఆ వార్తా సంస్థ వివరించింది. న్యూయార్క్‌ నగరంలోని బ్రూక్లిన్‌లో ఉన్న అమెరికా అటార్నీ కార్యాలయంతోనూ, న్యా య మంత్రిత్వ శాఖతోనూ మార్చిలోనే సమావేశం జరిగింది. ‘ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన చర్చలు ఇటీవలి వారాలలో మరింత ఊపందుకున్నాయి. చర్చలు ఇదే ఊపులో కొనసాగితే వచ్చే నెలలో అవి ఓ కొలిక్కి రావచ్చు. సంప్రదింపులు చాలా రహస్యంగా జరుగుతున్నందున వాటి వివరాలు బయటపెట్టలేమని కొందరు వ్యక్తులు తెలిపారు’ అని బ్లూమ్‌బర్గ్‌ వివరించింది. అదానీని విచారించే అంశం దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రాధాన్యతలలో ఉండకుండా చూసేందుకు కొందరు ప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నిస్తు న్నారు. దీనిపై పునరాలోచన చేయాలని వారు వేడుకుంటున్నారు.
భారత్‌లో విద్యుత్‌ కాంట్రాక్టులు పొందేందుకు 265 మిలియన్‌ డాలర్ల మేర ముడుపులు ముట్టజెప్పారని, నిధుల కోసం అమెరికా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ గౌతమ్‌ అదానీ, ఆయన అన్న కొడుకు, గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాగర్‌ అదానీ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వినీత్‌ ఎస్‌. జైన్‌లపై గత సంవత్సరం నవంబరులో అమెరికా న్యాయ మంత్రిత్వ శాఖ అభియోగాలు మోపింది. అదానీ గ్రూపునకు చెందిన ఇద్దరు డైరెక్టర్లపై అమెరికా సెక్యూరిటీలు – ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఇసి) సివిల్‌ ఫిర్యాదు కూడా చేసింది. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమంటూ అదానీ గ్రీన్‌ సంస్థ తోసిపుచ్చింది. వాటిపై స్వతంత్ర సమీక్ష కోసం న్యాయ సంస్థలను నియమించింది. ఎలాంటి అవకతవకలు జరగలేదంటూ ఆ సంస్థలు అదానీకి క్లీన్‌చిట్‌ ఇచ్చాయి. కాగా అభిశంసనను ఎదుర్కొంటున్న వినీత్‌ జైన్‌ పదవీకాలాన్ని అదానీ గ్రీన్‌ మరో ఐదు సంవత్సరాలు పొడిగించడం గమనార్హం.

➡️