ప్రజాశక్తి-అమరావతి : ఎస్సి, ఎస్టి కేసుల్లో నిందితులు దాఖలు చేసే ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ పరిధి అంశాన్ని ద్విసభ్య ధర్మాసనం తేల్చాలని జస్టిస్ టి మల్లికార్జునరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత ఎస్సి, ఎస్టి ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని సింగిల్ జడ్జి ఇటీవల తీర్పు చెప్పారు. నిందితులు నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చని వైసిపి నాయకులు విడదల రజిని, కాకాణి గోవర్థన్ రెడ్డి తరఫు న్యాయవాదులు వాదించారు. ఇందుకు పలు సుప్రీంకోర్టు ఉత్తర్వులను నివేదించారు. దీంతో ఈ అంశాన్ని తేల్చే వ్యవహారాన్ని ధర్మాసనానికి నివేదిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి చెందిన ఫైల్ను చీఫ్ జస్టిస్ ముందుంచాలని రిజిస్ట్రీకి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి వరకు రక్షణ కల్పించాలని కాకాణి లాయర్ వినతిని తోసిపుచ్చారు. చిలకలూరిపేట నియోజకవర్గం టిడిపి సోషల్ మీడియా ఇన్ఛార్జి పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనపై ఎస్సి, ఎస్టి ఎట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని విడదల రజిని హైకోర్టులో సవాల్ చేశారు. అక్రమ మైనింగ్ చేశారంటూ నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసును కాకాణి సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు.
