కోచి : కేరళలో రెండవ మంకీ పాక్స్ కేసు నమోదైంది. యుఎఇ నుండి ఇటీవలల వచ్చిన వ్యక్తిలో ఈ వైరస్కు సంబంధించిన లక్షణాలు వున్నట్లు డాక్టర్లు ధృవీకరించారు. కేరళలోని ఉత్తర మలప్పురం జిల్లాలో ఇప్పటికే ఆస్పత్రిలో చేరిన 38ఏళ్ళ వ్యక్తికి ఎంపాక్స్ ఇన్ఫెక్షన్కు చికిత్సను అందిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జి ఈ మేరకు ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. విదేశాల నండి వచ్చేవారు ఎలాంటి లక్షణాలు కనబడినా వెంటనే ఆస్పత్రులకు వెళ్ళాలని, ప్రభుత్వానికి విషయం తెలియచేయాలని మంత్రి కోరారు. సాధ్యమైనంత త్వరగా చికిత్స తీసుకోవాలని కోరారు. తాజా కేసులో వ్యక్తి లక్షణాలు కనిపించిన వెంటనే ఎవరితో కలవకుండా ఒంటరిగా వుండి తర్వాత ఆస్పత్రిలో చేరాడని తెలిపారు. ఆ వ్యక్తి నమూనాలను పరీక్షకు పంపామని, బుధవారం ఎంపాక్స్ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. సాధారణంగా రెండు నుండి నాలుగు వారాల పాటు వుండే ఈ ఇన్ఫెక్షన్ పక్కవారికి సోకే అవకాశాలు తక్కువ. స్వల్ప వైద్య చికిత్సలతో తగ్గిపోతుంది. జ్వరం, దద్దుర్లు, లింఫ్ నోడ్లు వాచడం వంటి లక్షణాలు వుంటాయి.
