న్యూఢిల్లీ : మరో నాలుగు రోజుల్లోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వారిలో కొంతమంది తమ రాజీనామా లేఖలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కస్తూర్బానగర్ నియోజవర్గం మదన్ లాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
తమ రాజీనామా లేఖలను ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్కు పంపినట్లు తెలిపారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో భవ్నా గౌడ్ (పాలం), నరేష్ యాదవ్ (మెహ్రౌలి), రోహిత్ మెహ్రౌలియా (త్రిలోక్పూరి), పవన్ శర్మ (ఆదర్శ నగర్), రాజేశ్ రిషి (జనక్పురి), బిఎస్ జాన్ (బిజ్వాసన్) ఉన్నారు. వీరికి టిక్కెట్లు ఇవ్వడానికి ఆప్ నిరాకరించడంతో ఇతర పార్టీలతో టచ్లో ఉన్నారని ఆప్ నాయకులు విమర్శించారు.
