పహల్గాం ఘటన వెనుక ఏడుగురు ఉగ్రవాదులు

  • వారిలో ఇద్దరు స్థానికులే
  • ముగ్గురి ఊహాచిత్రాలు విడుదల
  • సమాచారం అందిస్తే రూ.20లక్షల బహుమతి
  • బాధితులను పరామర్శించిన హోం మంత్రి

న్యూఢిల్లీ : పహల్గాంలోని బైసరన్‌లో ప్రకృతి అందాలు వీక్షిస్తున్న పర్యాటకులపై జరిపిన దాడిలో ఏడుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారని, వీరిలో నలుగురైదుగురు పాకిస్తానీయులేనని అధికారులు తేల్చారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు వున్నట్లుగా ప్రత్యక్షసాక్షులు, ఇంటెలిజెన్స్‌ నివేదికలు సూచిస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. 2018లో ఇద్దరు కాశ్మీరీలు పాక్‌ వెళ్లి అక్కడ శిక్షణ తీసుకుని ఈ దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. ‘ఉగ్రవాదులు మాట్లాడిన ఉర్దూ భాషను పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో వాడతారు. వారు కాశ్మీర్‌లోని ఏ ప్రాంతానికి చెందిన వారో ఇంకా తెలియలేదు’ అని భద్రతా సంస్థకు చెందిన ఓ అధికారి చెప్పారు. ఉగ్రవాదులు కాశ్మీర్‌లోకి ఎలా ప్రవేశించారో, వారు అక్కడ ఎంతకాలం నుండి ఉంటున్నారో అన్న విషయాలు ఇంకా తెలియరాలేదు.
దాడికి పాల్పడిన ఉగ్రవాదులలో ముగ్గురి ఊహా చిత్రాలను అధికారులు విడుదల చేశారు. వారికి సంబంధించిన సమాచారం అందిస్తే రూ.20 లక్షల చొప్పున రివార్డు అందజేస్తామని ప్రకటించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులందరూ పిర్‌ పంజాల్‌ పర్వత శ్రేణుల ఎగువ ప్రాంతాలకు తప్పించుకుని వెళ్ళిపోయి వుంటారని అనుమానిస్తున్నారు.
దీంతో సైన్యం, పారామిలటరీ దళాలు, జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇదిలావుండగా మంగళవారం సాయంత్రమే శ్రీనగర్‌ చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బైసరన్‌లో పర్యటించి దాడి వివరాలు తెలుసుకున్నారు. భద్రతా సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. దాడిలో గాయపడిన బాధితులను బుధవారం పరామర్శించారు.

➡️