విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ ఆశ్రయం

సరిహద్దుల నుంచి వచ్చినవారికి ఢిల్లీలో వసతి
ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే మంత్రికి లేఖ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకున్న విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ ఆశ్రయం కల్పించింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ డెస్క్‌ ద్వారా వందలాది మంది విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐని సంప్రదించారు. చాలా మంది విద్యార్థులను సరైన సమయంలో సురక్షితంగా తమ ప్రాంతాలకు తరలించేందుకు ఎస్‌ఎఫ్‌ఐ విజయవంతంగా సహాయపడింది. జమ్మూ కాశ్మీర్‌, పంజాబ్‌, చండీగఢ్‌ మొదలైన ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులను ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోనే ఎస్‌ఎఫ్‌ఐ నాయకత్వం రిసీవ్‌ చేసుకుంది. ఎస్‌ఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి దీప్షితా దార్‌, ఢిల్లీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సూరజ్‌ ఎలామోన్‌, ఐషీఘోష్‌, కేంద్ర కమిటీ సభ్యులు అభిజిత్‌ మణిలాల్‌, స్థానిక నాయకులు మోహినా ఫాతిమా, అనిల్‌ సేతుమాధవన్‌తో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విద్యార్థులకు స్వాగతం పలికారు. వారికి ఢిల్లీలోని హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ భవన్‌లో వసతి కల్పించారు. అక్కడ, ఎంఎ బేబి విద్యార్థులను కలిసి వారితో మాట్లాడారు. హెల్ప్‌లైన్‌ ఇప్పటికీ అందుబాటులో ఉందని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్‌ బిశ్వాస్‌ తెలిపారు. జమ్మూకాశ్మీర్‌, పంజాబ్‌, రాజస్తాన్‌, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితి ఆందోళన కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైనా సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూఖ్‌ బిశ్వాస్‌, సంయుక్త కార్యదర్శి ఆదర్శ్‌ ఎం సాజి, ఎస్‌ శిల్పతో కలిసి భటిండాలోని పంజాబ్‌ సెంట్రల్‌ యూనివర్శిటీని, క్యాంపస్‌లోని విద్యార్థులను కలిశారు. పంజాబ్‌లోని భటిండాలో పాకిస్తాన్‌ సైన్యం డ్రోన్‌ దాడి చేసిందని, మన సైన్యం ఆ దాడిని విజయవంతంగా తిప్పికొట్టిందని అన్నారు. ఈ సంఘటన పంజాబ్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ హాస్టల్‌ సమీపంలో జరిగిందని, విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి జోక్యం చేసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విశ్వవిద్యాలయ అధికారులను కలిశారు. కాగా హింస ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. పాఠశాలలు, విద్యా సంస్థలు మూసివేయడంతో ఆయా ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తగినంత సంఖ్యలో బస్సులు, రైళ్లు అందుబాటులో లేవని, అందువల్ల వారి ఇళ్లకు తిరిగి వెళ్లడం కష్టంగా ఉందని ఎస్‌ఎఫ్‌ఐ తెలిపింది.

➡️