సింధు జలాల ఒప్పందం నిలిపివేత

  • పాక్‌పౌరులు 48గంటల్లోగా దేశాన్ని వీడాలి
  •  అత్తారి చెక్‌పోస్టు మూసివేస్తాం
  • పహల్గాం దాడి నేపథ్యంలో భారత్‌ సంచలన నిర్ణయాలు
  • ప్రధాని నేతృత్వంలో భద్రతా కేబినెట్‌ కమిటీ భేటీ

న్యూఢిల్లీ : పహల్గాం దాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భద్రతా కేబినెట్‌ భేటీ (సిసిఎస్‌) బుధవారం సమావేశమై భద్రతా పరిస్థితులను సమీక్షించింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశానికి హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రభృతులు హాజరయ్యారు. దాడి అనంతరం నెలకొన్న పరిస్థితులు, ఇతర పరిణామాలను సుదీర్ఘంగా ప్రధాని వారితో చర్చించారు. అనంతరం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తక్షణమే అమల్లోకి వచ్చేలా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్‌ నిర్ణయించింది. అలాగే అత్తారి చెక్‌పోస్టును కూడా వెంటనే మూసివేయాలని నిర్ణయించారు. పాక్‌ జాతీయులెవరూ కూడా భారత్‌లో పర్యటించడానికి అనుమతించరాదని, భారత్‌లోని పాక్‌ జాతీయులు 48గంటల్లోగా దేశం వీడి వెళ్లాలని పేర్కొంది. అలాగే పాకిస్తాన్‌ హై కమిషన్‌లోని వైమానిక, నావికాదళ, ఆర్మీ సలహాదారులను అవాంఛనీయ వ్యక్తులుగా ప్రకటించింది.
ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌ కార్యాలయం నుండి త్రివిధ దళాలకు చెందిన ముగ్గురు సలహాదారులను, ఐదుగురు సపోర్ట్‌ సిబ్బందిని ఉపసంహరించుకుంది. ఎంబసీల్లోని సపోర్ట్‌ సిబ్బందిని 30కి తగ్గించనుంది. ప్రస్తుతం ఈ సంఖ్య 55గా వుంది. ఇది మే 1నుండి అమల్లోకి వస్తుంది. కీలకమైన ప్రాంతాలు సహా అన్ని చోట్లా అప్రమత్తత పాటించాల్సిందిగా బలగాలను ఆదేశించింది. ఈ ఉగ్ర దాడికి బాధ్యులైన వారిని తక్షణమే పట్టుకుని, శిక్షించాలని, దీని వెనుక సూత్రధారులను కూడా అదుపులోకి తీసుకోవాలని తీర్మానించింది. అన్ని బలగాలు అప్రమత్తంగా వుండాలని ఆదేశించింది.
అనంతరం సిసిఎస్‌ సమావేశం నిర్ణయాలను విదేశాంగ శాఖ వర్గాలు మీడియాకు తెలిపాయి. కేంద్ర పాలిత ప్రాంతంలో విజయవంతంగా ఎన్నికలను నిర్వహించిన నేపథ్యంలో ఈ దాడి జరిగిందని విదేశాంగ కార్యదర్శి వ్యాఖ్యానించారు. అంతకుముందు దాడి వార్త తెలియగానే ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటనను కుదించుకుని వచ్చిన వెంటనే విమానాశ్రయంలోనే సమావేశమై భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఈ సమావేశానికి విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ కూడా హాజరయ్యారు. పహల్గాంలో దాడి గురించి వారు ప్రధానికి వివరించారు. మరోవైపు హోం మంత్రి అమిత్‌ షా మంగళవారం సాయంత్రమే శ్రీనగర్‌ చేరుకొని అక్కడ భద్రతా చర్యలను సమీక్షిస్తున్నారు.

➡️