20 లీటర్ల నీటి బాటిళ్లు, సైకిళ్లపై జిఎస్‌టి తగ్గింపునకు ఉపసంఘం ప్రతిపాదన

న్యూఢిల్లీ : పలు ఉత్పత్తులపై వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ల్లో మార్పులు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. 20 లీటర్ల ప్యాకేజ్డ్‌ నీటి బాటిళ్లు, సైకిళ్లు, నోట్‌బుక్స్‌ తదితర ఉత్పత్తులపై ఎట్టకేలకు జిఎస్‌టిని తగ్గించాలని ప్రతిపాదించింది. బీహార్‌ డిప్యూటీ సిఎం సామ్రాట్‌ చౌదరి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో పలు నిర్ణయాలు తీసుకుంది. శనివారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదిత వివరాలు.. ప్రస్తుతం 20 లీటర్ల నీటి బాటిల్‌పై 18 శాతం జిఎస్‌టిని వసూలు చేస్తుండగా.. దీన్ని 5 శాతానికి తగ్గించాలని, అదేవిధంగా రూ.10,000లోపు ధర కలిగిన సైకిళ్లపై 12 శాతంగా ఉన్న పన్నును కూడా 5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. అలాగే నోట్‌ బుక్స్‌పైనా 12 నుంచి ఐదు శాతానికి తగ్గించాలని సూచించింది. మరోవైపు ఖరీదైన బూట్లు, చేతి వాచీలపై పన్ను రేట్లు సవరించాలని, రూ.15,000 కంటే అధిక విలువ కలిగిన బూట్లు, రూ.25 వేల కంటే ఎక్కువ ధర ఉన్న చేతి వాచ్‌లపై జిఎస్‌టిని 18 నుంచి 28 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. 18 శాతం శ్లాబులో ఉన్న హెయిర్‌ డ్రైయర్లు, హెయిర్‌ కర్టర్లు, బ్యూటీ, మేకప్‌ సామగ్రిపై ఉన్న జిఎస్‌టిని మళ్లీ 28 శాతం శ్లాబులోకి చేర్చాలని పేర్కొంది. ఈ పన్ను రేట్లపై జిఎస్‌టి కౌన్సిల్‌ భేటీలో తుది నిర్ణయం చేయాల్సివుంది. అలాగే బీమాపై వసూలు చేస్తోన్న 18 శాతం జిఎస్‌టి పన్ను భారంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో జిఎస్‌టి నుంచి ఆరోగ్య బీమా, జీవిత పాలసీలను మినహాయించాలని ఉపసంఘం ప్రతిపాదించింది. టర్మ్‌ ఇన్సూరెన్స్‌తో పాటు రూ.5 లక్షల వరకు తీసుకునే ఆరోగ్య బీమాపై జిఎస్‌టి నుంచి మినహాయించాలని సూచించింది.

➡️