న్యూఢిల్లీ : ఆస్తి వివాదంలో ఒక వ్యక్తి దత్తత దస్తావేజును కొట్టివేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈచర్య తండ్రి ఆస్తిలో కుమార్తెలకు వారసత్వంగా లభించే హక్కును నిరాకరించడమేనని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. దత్తత దస్తావేజు నిబంధనలకు అనుగుణంగా లేదని, చట్టబద్ధమైన పవిత్రత లేదని పేర్కొంది. ఈ దత్తత గ్రామీణ ప్రాంతాల్లో కుమార్తెలను వారసత్వం నుండి తోసిపుచ్చేందుకు అనుసరించే పద్ధతి అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఈ దత్తత చర్యలు ఎలా నిర్వహించబడతాయో మాకు తెలుసునని అన్నారు.
కేసు వివరాలు :
ఉత్తర ప్రదేశ్కి చెందిన భునేశ్వర్సింగ్ కుమార్తెలు శివకుమారి, హర్మౌనియాలు. భునేశ్వర్ సింగ్ ఇటీవల మరణించారు. భునేశ్వర్ ఆస్తిలో హక్కు ఉందంటూ అశోక్కుమార్ కోర్టును ఆశ్రయించారు. స్వయానా తన తండ్రి సుబేదార్ సింగ్ నుండి భునేశ్వర్ తనను ఒక వేడుకలో దత్తత తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. దత్తత వేడకకు సంబంధించిన ఫొటోను కూడా కోర్టుకు సమర్పించారు.
1967, ఆగస్ట్9 నాటి దత్తత దస్తావేజు చెల్లుబాటును నిరాకరిస్తూ 2024, డిసెంబర్ 11న హైకోర్టు తీర్పునిచ్చింది.1983లో దాఖలు చేసిన దత్తత దస్తావేజు చెల్లుబాటుపై నిర్ణయం తీసుకోవడంలో నాలుగు దశాబ్దాలకు పైగా జాప్యం చేసినందుకు అలహాబాద్ హైకోర్టు క్షమాపణలు తెలిపింది. బిడ్డను దత్తత తీసుకునే వ్యక్తికి అతని భార్య అనుమతి ఉండాలనే తప్పనిసరి నిబంధన కూడా లేదని తెలిపింది. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా అశోక్ కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లారు.