Supreme Court : కొలిజియం సిఫార్సులను త్వరగా క్లియర్‌ చేయండి

కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో న్యాయమూర్తుల నియామకాలపై కొలిజియం సిఫార్సులను త్వరగా క్లియర్‌ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీల కారణంగా పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య పెరిగిపోతుండటం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తుల నియామకాల కోసం సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను త్వరగా ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అభరు ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బెయిల్‌ మంజూరు కోసం ఉద్దేశించిన ఒక సుమోటో కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వివిధ హైకోర్టుల్లో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 7,24,192 క్రిమినల్‌ అప్పీళ్ల ఆందోళనకరమైన పరిస్థితి అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పెండింగ్‌ అనేక హైకోర్టుల్లో న్యాయమూర్తుల కొరతకు నేరుగా ముడిపడి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. సంక్షోభాన్ని నొక్కిచెప్పడానికి ధర్మాసనం వివరణాత్మక గణాంకాలను అందించింది. ‘2,72,000 క్రిమినల్‌ అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్న అలహాబాద్‌ హైకోర్టులో 160 మంది న్యాయమూర్తుల సంఖ్య ఉన్నప్పటికీ, కేవలం 79 మంది న్యాయమూర్తులతో పనిచేస్తున్నారు. ముంబాయి హైకోర్టులో 94 మంది న్యాయమూర్తులకు గానూ కేవలం 60 మంది న్యాయమూర్తులు ఉన్నారు. కోల్‌కతా హైకోర్టులో 72 పోస్టులు మంజూరు చేయగా, 44 మంది న్యాయమూర్తులు మాత్రమే పనిచేస్తున్నారు. అదేవిధంగా, ఢిల్లీ హైకోర్టు 60 మందికి గానూ 36 మంది న్యాయమూర్తులతో పనిచేస్తుంది’ అని ధర్మాసనం తెలిపింది. కనుక న్యాయమూర్తుల పోస్టులను అత్యవసరంగా భర్తీ చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు నిర్దేశించింది.
హైకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల డేటాను ఇటీవల సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. కొలీజియం సిఫార్సులు త్వరగా ఆమోదం పొందేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరింది. నవంబర్‌ 2022 నుండి క్లియరెన్స్‌ పెండింగ్‌లో ఉన్న సిఫార్సులతో వెబ్‌సైట్‌లో ఉన్న వివరాలను ప్రస్తావించింది. వాటిలో 2023లో ఐదు ప్రతిపాదనలు, 2024లో 12 ప్రతిపాదనలు, ప్రస్తుత సంవత్సరంలో మరో 12 ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.

➡️